నిర్మల్చైన్గేట్: బాల్య వివాహాల నివారణకు ప్రజలు బాధ్యతగా సహకరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు కోరారు. జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలన, 100 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రచారరథాన్ని కలెక్టరేట్ ప్రాంగణంలో సోమవారం ప్రారంభించారు. బాల్య వివాహాలు పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతో ‘‘బాల్య వివాహ రహిత భారత్’’ కార్యక్రమంలో భాగంగా ప్రచార రథాన్ని ప్రారంభించామన్నారు. జిల్లాలోని అన్నిగ్రామాలు, విద్యాసంస్థల్లో విస్తృత అవగాహన కల్పించాలని, 18 సంవత్సరాలలోపు బాలికలకు, 21 ఏళ్లలోపు బాలురకు వివాహం చేయడం చట్టరీత్యా నేరమన్నారు. బాల్య వివాహాలు పిల్లల ఆరోగ్యం, విద్య, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయన్నారు. కార్యక్రమంలో విజన్ సంస్థ జిల్లా కో ఆర్డినేటర్ శరత్కుమార్, రాజు, బాలల పరిరక్షణ అధికారి మురళి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ వహీద్, చైల్డ్లైన్ కోఆర్డినేటర్ గంగాధర్, మిషన్ శక్తి సిబ్బంది, విజన్ సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.


