‘అడెల్లి’కి భక్తుల తాకిడి
సారంగపూర్: అడెల్లి మహాపోచమ్మ ఆలయం ఆది వారం భక్తులతో కిటకిటలాడింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు నిజామాబాద్, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, మహారాష్ట్ర నుంచి భక్తులు అధికసంఖ్యలో వచ్చారు. అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. నైవేద్యాలు, ముడుపులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్ని వసతులు కల్పించారు. స్థానిక ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. కాగా, అమ్మవారిని మాజీ ఎంపీ సోయం బాపూరావు, నిర్మల్ ఆర్డీవో రత్నకళ్యాణి దంపతులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ ఈవో భూమయ్య, చైర్మన్ భోజాగౌడ్ ఘనస్వాగతం పలికి దర్శనానంతరం సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు.
రేపు ఆలయం మూసివేత
అడెల్లి మహాపోచమ్మ ఆలయం ఈనెల 3న ఉద యం 7నుంచి 4వ తేదీ ఉదయం 6గంటల వరకు మూసివేయనున్నట్లు ఆలయ ఈవో భూమయ్య ఓ ప్రకటనలో తెలిపారు. మంగళవారం కేతుగ్రస్త చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 6గంటలకు అభిషేకం, అలంకరణ, హారతి నివేదన అనంతరం 7గంటల నుంచి ఆలయం మూసివేయనున్నట్లు పేర్కొన్నారు. 4వ తేదీన ఉదయం 6గంటలకు ఆలయంలో గణపతి, గౌరీపూజ, పుణ్యాహావాచనం, అమ్మవారి ఆలయ ప్రాంగణం సంప్రోక్షణ, పంచామృతాభిషేకం, అలంకరణ అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించనున్నట్లు తెలిపారు. భక్తులు గమనించి సహకరించాలని కోరారు.


