చిత్తడి నేలల పరిరక్షణతోనే సమతుల్యత
నిర్మల్చైన్గేట్: ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో చిత్తడి నేలలు (వెట్ ల్యాండ్స్) అత్యంత కీలకపాత్ర పోషిస్తాయని కలెక్టర్ అభిలాష అభినవ్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో చిత్తడి నేలల గుర్తింపు, సంరక్షణపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న చిత్తడి నేలలను శాసీ్త్రయంగా గుర్తించి, వాటిని అభివృద్ధి పరిచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ప్రక్రియలో భాగంగా అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి, సంయుక్తంగా క్షేత్రస్థాయి సర్వే నిర్వహించాలన్నారు. చిత్తడి నేలల వల్ల భూగర్భ జలమట్టం పెరగడమే కాకుండా, జీవవైవిధ్యం పెంపొందుతుందని, వీటిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అన్నారు. జిల్లాలో గుర్తించిన చిత్తడి నేలలను కేవలం పర్యావరణ దృక్కోణంలోనే కాకుండా, పర్యాటక కేంద్రాలుగా కూడా తీర్చిదిద్దే అవకాశం ఉందని, దీనివల్ల స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. ఈ గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేసి, సమగ్ర నివేదికను అందజేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా అటవీ శాఖాధికారి సుశాంత్ సుఖదేవ్ బోబడే, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విజయలక్ష్మి, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, జెడ్పీ సీఈవో శంకర్, జిల్లా పరిశ్రమల మేనేజర్ నరసింహారెడ్డి, మత్స్య శాఖ ఏడీ రాజ నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.


