గృహలక్ష్మి.. ఇందిరమ్మగా
లబ్ధిదారులకూ ఆర్థిక సాయం ఇందిరమ్మ ఇళ్లుగా పరిగణించనున్న ప్రభుత్వం బేస్మెంట్ స్థాయిలో నిలిచిన నిర్మాణాలకు వర్తింపు
షరతులు ఇలా..
బేస్మెంట్ ప్రాంతం 400 చదరపు అడుగుల నుంచి 600 చదరపు అడుగుల మధ్య ఉండాలి. ఇప్పటికే ఉన్న బేస్మెంట్ 400 చదరపు అడుగుల కంటే తక్కువగా ఉంటే దానిని కనీసం 400 చదరపు అడుగులకు పెంచడానికి ప్లింత్ బీమ్లు వేయాలి. పెద్ద బేస్మెంట్ల ప్లింత్ ఏరియా గరిష్టంగా 600 అడుగులకు పరిమితం చేశారు. అయితే వీరికి మంజూరు ఇచ్చినప్పటికి బేస్మెంట్ లెవల్ బిల్లు లక్ష రూపాయలు ప్రభుత్వం ఇవ్వదు. మిగతా రూ.4 లక్షలు రూఫ్ లెవల్ రూ.లక్ష, ఆర్సీ లెవల్ రూ.2 లక్షలు, పూర్తి అయిన తర్వాత రూ.లక్ష చెల్లిస్తుంది.
నిర్మల్చైన్గేట్: గత బీఆర్ఎస్ ప్రభుత్వ జాగా ఉండి ఇల్లు లేని నిరుపేదలు సొంత ఇల్లు నిర్మించుకునేందుకు రూ.3 లక్షల ఆర్థికసాయం అందించేలా గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభించింది. పథకం ప్రారంభించిన కొద్దిరోజులకే ప్రభుత్వం మారడంతో లబ్ధిదారులు ప్రయోజనం పొందలేకపోయారు. అటువంటి వారికి కూడా ఇందిరమ్మ పథకం కింద ప్రయోజనం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం అధికారులు లబ్ధిదారులను గుర్తించే పనుల్లో ఉన్నారు.
బేస్మెంట్ లెవల్లోనే..
గత ప్రభుత్వం గృహలక్ష్మి పథకం ద్వారా రూ.3 లక్షలు అందిస్తామని ప్రకటించింది. ఇందుకు లబ్ధిదా రులను ఎంపిక చేసింది. చాలా మంది ఇంటి నిర్మాణాలు మొదలు పెట్టారు. అయితే ప్రభుత్వం మారడంతో ఈ పథకం నిలిచి పోయింది. ఈ పథకం కింద ఇల్లు మంజూరై, పనులు ప్రారంభించిన లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా ప్రస్తుత ప్రభుత్వం వారికి శుభవార్త అందించింది. బేస్మెంట్ దశ దాటి నిలిచిపోయిన ఇళ్లను పరిగణనలోకి తీసుకుంటూ మిగతా పనులు కొనసాగించేందుకు లబ్ధిదారులకు రూ.4 లక్షలు విడతల వారీగా అందించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని ఇందిరమ్మ ఇళ్లుగా పరిగణిస్తామని పేర్కొంది.
నియోజకవర్గానికి మూడు వేల చొప్పున..
సొంత స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించేలా 2023లో శాసనసభ ఎన్నికలకు నాలుగు నెలల ముందు అప్పటి ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని ప్రకటించింది. దాంతో పెద్ద ఎత్తున నిరుపేదలు దరఖాస్తు చేసుకోగా.. నియోజకవర్గానికి 3 వేల చొప్పున ఇళ్లను ప్రకటించి లబ్ధిదారులను సైతం ఎంపిక చేసి మంజూరు పత్రాలను అందించిది. కొందరు నిర్మాణ పనులు చేపట్టగా.. ఇంకా కొందరు ఇళ్లు నిర్మించుకోవాలా..? వద్దా..? అన్న మీమాంసలో పడ్డారు. ఈ క్రమంలోనే ఎన్నికల కోడ్ కావడం, ప్రభుత్వం మారిపోవడంతో ఇళ్లు ప్రారంభించిన లబ్దిదారులు వాటిని కొనసాగించలేక పోయారు.
సర్వే చేసి..
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ప్రభుత్వం తాజాగా కొన్ని మార్పులు తీసుకొచ్చింది. పాత ఇందిరమ్మ పథకం, గృహలక్ష్మి పథకాల కింద ఇప్పటికే బేస్మెంట్ లెవల్ వరకు నిర్మించుకుని ఆర్థిక ఇబ్బందుల కారణంగా మధ్యలో వదిలేసిన వారు తిరిగి ఇంటిని పూర్తి చేసుకునేలా చర్యలు చేపడుతోంది. బేస్మెంట్ దశలోనే ఆగిపోయినవి ఎన్నిఉన్నాయో లెక్కలు తేల్చాలని అధికారులను ఆదేశించింది. ఈనేపథ్యంలో అధికారులు ఊరూరా తిరిగి సర్వే చేసి బేస్మెంట్ దశలో ఆగిన ఇళ్ల వివరాలు సేకరించారు. గృహలక్ష్మి పథకం ద్వారా 231, ఇందిరమ్మ పథకం ద్వారా 70 వరకు ఉన్నట్లు తేల్చారు. ఈ నివేదికను ప్రభుత్వానికి పంపారు.


