ప్రచార హోరు.. దావత్ల జోరు
నిర్మల్చైన్గేట్: మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. అభ్యర్థులు తమను గెలిపిస్తే ఏం చేస్తామో చెప్పకుండా, హామీలు ఇవ్వకుండా.. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ఎవరికి ఎంత ఇవ్వాలి.. ఎవరెవరికి మందు, విందు ఏర్పాటు చేయాలని ఓటర్లను ఆకర్షించే ప్రలోభాలపై దృష్టి పెడుతున్నారు. పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. దావత్లు ఇస్తున్నారు.
ఓటర్ల ప్రసన్నం కోసం..
పేద ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు వార్డుల వారీగా బియ్యం, నూనె, పప్పు, చక్కెర వంటి పదార్థాలతో కూడిన కిట్లను నేరుగా ఓటర్ల ఇంటికి పంపుతున్నారు. ఇక చీకటి పడిన తర్వాత కాలనీల్లో ఇల్ల డాబాలపై దావత్లు ఏర్పాటు చేస్తున్నారు. గెలుపు కోసం ఖర్చులకు వెనుకాడడం లేదు.
మహిళలు, యువతపై ఫోకస్..
మహిళలు, యువత, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలపైనే అభ్యర్థులు ప్రధాన దృష్టి పెట్టారు. అభివృద్ధి హామీలకు బదులు ఈ వర్గాలను తక్షణం ప్రసన్నం చేసే పద్ధతులు అమలు చేస్తున్నారు. ‘ఓటు మనదే, అభ్యర్థి మనోడే‘ అనే నినాదంతో ఇంటింటి ప్రచారాలు చేస్తున్నారు. సాయంత్ర సామూహిక విందులు ఏర్పాటు చేస్తున్నారు.


