
పాఠశాలల్లో బేస్లైన్ పరీక్షలు
● అభ్యసనస్థాయిల గుర్తింపునకు పరీక్షలు ● 2 నుంచి పదో తరగతి వరకు మదింపు ● సామర్థ్యమెంత.. తీర్చిదిద్దాల్సినదెంత? ● ఫలితాల ఆధారంగా బోధనాకార్యక్రమాలు
నిర్మల్ఖిల్లా: గత విద్యా సంవత్సరంలో విద్యార్థులు సాధించిన కనీస అభ్యసన లక్ష్యాలను అంచనా వేసేందుకు, జిల్లా పాఠశాల విద్యాశాఖ 2 నుంచి 10వ తరగతి విద్యార్థులకు బేస్లైన్ పరీక్షలు నిర్వహిస్తోంది. జూన్ 25 నుంచి 30 వరకు ఈ పరీక్షల ద్వారా విద్యార్థుల క్షేత్రస్థాయి సామర్థ్యాలను మదింపు చేసి, వారి అభ్యసన స్థాయిని పెంపొందించే ల క్ష్యాలను రూపొందించనున్నారు. 1 నుంచి 5వ తరగతి విద్యార్థుల కోసం ఎఫ్ఎల్ఎన్ (ఫౌండేషన్ ఆఫ్ లిటరసీ అండ్ న్యూమరసీ) కార్యక్రమం, 6 నుంచి 10వ తరగతి విద్యార్థుల కోసం లిప్ (లర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం) కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. జిల్లాలోని 735 పాఠశాలల్లో దాదాపు 60 వేల మంది విద్యార్థులు ఈ పరీక్షల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు ఎస్సీఈఆర్టీ రూపొందించిన ప్రశ్నపత్రాలతోపాటు, ఉపాధ్యాయులు, మండల, జిల్లాస్థాయి అధికారులకు తగిన సూచనలు, సలహాలు అందించారు.
సామర్థ్యాల మదింపు
ఈ పరీక్షలు విద్యార్థుల ప్రస్తుత అభ్యసన సామర్థ్యాలను, వయసు, తరగతుల వారీగా అంచనా వేయడంతోపాటు, వాటిని మెరుగుపర్చడానికి అవసరమైన లక్ష్యాలను గుర్తిస్తాయి. ప్రాథమిక స్థాయి (1 నుంచి 5వ తరగతి) విద్యార్థులకు తెలుగు, గణితం, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో కనీస సామర్థ్యాలను పరీక్షిస్తా రు. ఇందులో చదవడం, రాయడం, చదివినదాన్ని అర్థం చేసుకోవడం వంటి సూక్ష్మ సామర్థ్యాలు ఉన్నాయి.
తెలుగు: సరళ పదాలు, గుణింతాలు, ఒత్తుల పదా లు, వాక్యాలు, పేరాలను తడబడకుండా, తప్పులు లేకుండా నిర్ణీత సమయంలో చదవడం.
గణితం: కూడిక, తీసివేత, గుణకారం, భాగాహారం వంటి చతుర్విధ ప్రక్రియలు, రెండు, మూడు అంకెల సంఖ్యలతో గణనలు.
ఇంగ్లిష్: పదాలు, వాక్యాల చదవడం, అర్థం చేసుకోవడం.
విద్యాప్రమాణాలు మరింత మెరుగు..
రాష్ట్రపాఠశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు బేస్లైన్ టెస్టులను నిర్వహిస్తాం. ఈ మేరకు ఇప్పటికే తగిన మార్గదర్శకాలు జారీ చేశాం. ఈ పరీక్షల ద్వారా విద్యా ప్రమాణాలను మెరుగు పడటమే కాకుండా ఫలితాల ఆధారంగా తగిన ప్రణాళికల రూపొందించడానికి అవకాశం ఉంటుంది.
– పి.రామారావు, డీఈవో, నిర్మల్
ఉన్నత తరగతులకు..
ఉన్నత తరగతులు (6 నుంచి 10వ తరగతి) విద్యార్థులకు అన్ని సబ్జెక్టుల్లో సామర్థ్యాలను మదింపు చేస్తారు. వీటిలో విషయ పరిజ్ఞానం, విశ్లేషణాత్మక నైపుణ్యాలు పరిశీలిస్తారు. విద్యా సంవత్సరంలో మూడు దశల పరీక్షలు, ఎఫ్ఎల్ఎన్, లిప్ కార్యక్రమాలు, పాఠశాల విద్యాశాఖ ఈ విద్యా సంవత్సరంలో మూడు దశల్లో పరీక్షలను నిర్వహిస్తోంది.
బేస్లైన్ టెస్ట్: విద్యా సంవత్సరం ప్రారంభంలో (ఈ నెల 25 నుంచి 30 వరకు) గత ఏడాది నేర్చుకున్న సామర్థ్యాలను అంచనా వేస్తారు.
మిడ్లైన్ టెస్ట్: మధ్యంతరంగా విద్యార్థుల పురో గతిని మదింపు చేస్తారు.
ఎండ్లైన్ టెస్ట్: విద్యా సంవత్సరం చివరలో సామర్థ్యాల సాధన స్థాయిని గుర్తిస్తారు.
ఫలితాల నమోదు, విశ్లేషణ
బేస్లైన్ పరీక్షల ఫలితాలను జూలై 15లోగా తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ రూపొందించిన ప్రత్యేక యాప్లో విద్యార్థుల వారీగా నమోదు చేయాలి. ఈ ఫలితాల ఆధారంగా విద్యార్థుల సామర్థ్యాలను విశ్లేషించి, అభ్యసన లోపాలను సరిదిద్దేందుకు కార్యక్రమాలను రూపొందిస్తారు. ఈ విశ్లేషణ ఆధారంగా ఉన్నతాధికారులు విద్యార్థుల అభివృద్ధికి నిర్దేశిత లక్ష్యాలను రూపొందిస్తారు.