
పరిమితికి మించి ప్రవేశాలు వద్దు
● కేజీబీవీల్లో అడ్మిషన్లపై టీయూటీఎఫ్ అభ్యంతరం
నిర్మల్ఖిల్లా: జిల్లాలోని కస్తూరిబాగాంధీ విద్యాలయాల్లో పరిమితికి మించి బాలికలను చేర్చుకోవడంపై తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీయూటీఎఫ్) అభ్యంతరం వ్యక్తం చేసింది. సంఘ జిల్లా కార్యవర్గ సభ్యులతో కూడిన బృందం జిల్లా విద్యాశాఖ అధికారి పి.రామారావును శుక్రవారం కలిసి వినతిపత్రం అందజేసింది. సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు అబ్బడి మురళీమనోహర్రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా, పరిషత్ మండల పరిషత్ పాఠశాలల నుంచి ఏటా 4 వేల మంది విద్యార్థులు కేజీబీవీలు, వివిధ గురుకుల పాఠశాలల్లో చేరుతున్నారని తెలిపారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతోందని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని కేజీబీవీలలో పరిమితికి మించి విద్యార్థులు ఉన్నారని తెలిపారు. దీంతో నాణ్యమైన విద్య అందడం లేదని వెల్లడించారు. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల మనుగడ ప్రశ్నార్థకమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతీ తరగతి గదిలో 40 మంది విద్యార్థులు మాత్రమే ఉండాలన్న నిబంధన అమలు చేయాలని కోరారు. విద్యార్థులు పరిమితికి మించితే హాస్టళ్ల నిర్వహణలో సమస్యలు తలెత్తుతాయని తెలిపారు. ఈ విషయంపై త్వరితగతిన మార్గదర్శకాలు జారీ చేయాలని డీఈవోను కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తొడిశెట్టి రవికాంత్, వాహీద్ఖాన్, రాష్ట్ర సహాధ్యక్షుడు లక్ష్మీప్రసాద్రెడ్డి, జిల్లా కోశాధికారి మేడారపు శ్రీనివాస్, మొయిజుద్దీన్, వినోద్రాజ్ ఆయా మండలాల బాధ్యులు పాల్గొన్నారు.