
మెడికల్ కాలేజీలో మానిటరింగ్ కమిటీ
నిర్మల్చైన్గేట్: ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మౌలిక సదుపాయాలు, సిబ్బంది లోపాలను పరిష్కరించడానికి ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీ మానిటరింగ్ కమిటీ నిర్మల్ వైద్య కళాశాలను శుక్రవారం సందర్శించింది. జిల్లా జనరల్ ఆస్పత్రి, ప్రసూతి ఆస్పత్రిని కూడా తనిఖీ చేసింది. హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ జాయింట్ సెక్రెటరీ అయిషా మస్రత్ ఖానమ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ నేతృత్వంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్, ఎంసీఎంసీ సభ్యులు మెడికల్ కళాశాల, బోధన ఆస్పత్రిని సందర్శించారు. వార్డులు, బ్లడ్ బ్యాంకు, ఐసీయూ, విద్యార్థుల తరగతి గదులు, ల్యాబ్లు, హాస్టల్ గదులను పరిశీలించారు. జాతీయ వైద్య ఆరోగ్య మిషన్ నిబంధనల మేరకు దవాఖానలో సౌకర్యాలు తెలుసుకున్నారు. కల్పించాల్సిన సౌకర్యాల కోసం అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కళాశాల ప్రిన్సిపాల్, దవాఖాన సూపరింటెండెంట్లను ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న భవనాల పనులను వేగంగా పూర్తి చేయాలని బృందం సూచించింది. ఇందుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి నివేదిక సమర్పిసామని తెలిపింది. దవాఖానలో సీసీ కెమెరాల ఏర్పాటు, విద్యార్థుల రవాణా కోసం బస్సు, దవాఖాన, మెడికల్ కళాశాలలో భద్రత చర్యలు చేపట్టడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. బృందం వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ గోపాల్సింగ్, అదనపు సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్ కుమార్, ప్రసూతి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సరోజ, ఆర్ఎంవో సమత, నర్సింగ్ సూపరింటెండెంట్ వనజ, డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్ విజయ లక్ష్మి, ఆస్పత్రి సిబ్బంది ఉన్నారు.
సమస్యలు, వసతుల తనిఖీ
ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని ప్రకటన

మెడికల్ కాలేజీలో మానిటరింగ్ కమిటీ