
అసైన్డ్భూమిని కబ్జా నుంచి కాపాడాలి
ఖానాపూర్: మండలంలోని గోసంపల్లెలో అన్యాక్రాంతమవుతున్న అసైన్డ్భూమిని కబ్జా నుంచి కాపాడి ఇళ్లు లేని పేదలకు పంపిణీ చేయాలని కోరుతూ సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.విలాస్, సహాయ కార్యదర్శి ఎల్ఆర్ ఉపాలి సోమవారం తహసీల్దార్ సుజాతకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోసంపల్లె గ్రామాన్ని ఆనుకుని ఉన్న పీపీల్యాండ్ను కొందరు వ్యక్తులు తమ ఆధీనంలోకి తీసుకుని అక్రమ నిర్మాణాలు చేస్తున్నారన్నారు. ఇలాంటి నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని కోరారు. లేనిపక్షంలో తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు బూక్యా రమేశ్నాయక్, తదితరులు పాల్గొన్నారు.