
మాట్లాడుతున్న జిల్లా కార్యదర్శి ప్రభాకర్రెడ్డి
● సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్రెడ్డి
ఎదులాపురం: ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులపై ఉద్దేశపూర్వకంగా ఈడీ దాడులతో పాటు వారిని వ్యక్తిగతంగా ఇబ్బందులకు గురి చేయడం బీజేపీ ప్రభుత్వ హేయమైన రాజకీయాలకు నిదర్శనమని సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వ్యతిరేక విధానాలు అవలంభిస్తుందన్నారు. ప్రశ్నించే హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు రాజ్యాంగబద్ధమైనప్పటికీ బీజేపీ ప్రభుత్వం హరించి వేస్తుందన్నారు. రాచరిక పాలన కొనసాగిస్తుందని వివరించారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి బీజేపీ హటావ్ భారత్కో బచావ్ నినాదంతో సీపీఐ పోరాటాలకు సిద్ధమవుతోందని వివరించారు. ఏప్రిల్ 14న మొదలైన ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమం మే 14 వరకు కొనసాగనుందని, ఇందులో భాగంగా ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలను కలుపుకుని ప్రజా సమస్యలపై పోరాడటం చేస్తామని తెలిపారు. ఇందులో పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు ముడుపు నళినిరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు రాములు, పట్టణ కార్యదర్శి అరుణ్కుమార్, గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ పాల్గొన్నారు.