H3N2 Virus: భారత్‌లో రెండు మరణాలు.. ఎక్కడంటే?

Two Persons Died Of Influenza Caused By H3N2 Virus - Sakshi

సాక్షి, ఢిల్లీ: హెచ్3ఎన్2 ఇన్‌ప్లూయెంజా ఫ్లూ.. ఈ వైరస్‌ బారినపడిన వారి సంఖ్యలో దేశంలో రోజురోజుకు పెరిగిపోతోంది. మరోవైపు.. ఈ వైరస్‌ కారణంగా దేశంలో ఇద్దరు మృత్యువాతపడటం ఆందోళన కలిగిస్తోంది. అయితే, ఈ ఫ్లూ వైరస్‌ పట్ల భయపడాల్సిన పనిలేదని వైద్యులు చెబుతున్నారు. 

ఇదిలా ఉండగా, హెచ్3ఎన్2 వైరస్ కారణంగా హర్యానాలో తొలి మరణం సంభవించిందని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. కర్ణాటకలో కూడా మరో​ వ్యక్తి ఇదే వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయినట్టు పేర్కొంది. చనిపోయిన వ్యక్తి హసన్‌ జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించినట్టు కర్నాటక ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్‌ వెల్లడించారు. మరోవైపు.. ఈ వైరస్‌ బారినపడిన వారి సంఖ్య గతకొన్ని నెలలుగా వేల సంఖ్యలో ఉందని అధికారులు చెబుతున్నారు. కాగా, ఈ వైరస్‌ బారినపడకుండా ఉండాలంటే.. రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించడం, తరచుగా చేతులు కడుక్కోవడం, భౌతిక దూరం పాటించాలని ఢిల్లీ ఎయిమ్స్‌ మాజీ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా తెలిపారు. 

ఇక, ఈ వైరస్‌ సోకినవారిలో జ్వరం, జలుబు, తలనొప్పి, ఒళ్లునొప్పులు, గొంతునొప్పి, వాంతులు, విరేచనాలు, రుచి, వాసన కోల్పోవడం వంటి లక్షణాలు కన్పిస్తాయి. అలాగే ఈ ఫ్లూ లక్షణాలు ఒకటి నుంచి నాలుగు రోజుల్లోనే తెలిసిపోతాయి. హెచ్‌3ఎన్‌2 బారినపడివారిలో లక్షణాలు కన్పించకపోతే ఇతరులకు వ్యాప్తి చెందే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అలాగే ఈ ఇన్‌ఫ్లూయెంజా బారినపడితే శ్వాసకోశ సంబంధిత సమస్యలు కూడా తక్కువగానే ఉంటాయి. ఆక్సిజన్ అందిచాల్సిన అవసరం కూడా చాలా తక్కువగా ఉంటుంది. అయితే, ఓ వ్యక్తికి సోకింది కోవిడ్‌ లేక ఫ్లూనా అని కచ్చితంగా నిర్ధరించుకోవాలంటే కరోనా టెస్టు తప్పకుండా చేయించుకోవాల్సిందేని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే హెచ్‌3ఎన్‌2 ఇన్‌ఫ్లూయెంజా బారిన వారికి చికిత్సలో  యాంటీబయాటిక్స్‌ ఉపయోగించవద్దని ఐసీఎంఆర్ సూచించింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top