Viral: కుక్కలకు గొడుగు పట్టి.. మనుషులను దారిలో పెట్టి..
Published
Thu, Sep 23 2021 9:22 AM
కోల్కతా: ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ చిత్రం నెటిజన్ల మనసులు దోచుకుంది. దీనికి సంబంధించిన వివరాలను పశ్చిమ బెంగాల్ పోలీసులు వెల్లడించారు. కోల్కతాలోని పార్క్ సర్కస్ సెవన్ పాయింట్ వద్ద తరుణ్కుమార్ మండల్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ విధులు నిర్వర్తిస్తుండగా.. వర్షం మొదలైంది. దీంతో ఆయన తన వద్దనున్న గొడుగు పట్టుకొని ట్రాఫిక్ను క్రమబద్ధీకరిస్తూ ఉన్నారు.
ఇంతలో కొన్ని కుక్కలు ఆయన వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చాయి. ఆయన ఆప్యాయంగా వాటికి కూడా తన గొడుగుతో రక్షణ ఇచ్చారు. ఇంతలో దీన్ని గుర్తించిన ఓ ఫొటోగ్రాఫర్ వెంటనే తన కెమెరాను క్లిక్మనిపించారు. ఈ చిత్రాన్ని చూసిన నెటిజన్లు తరుణ్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గొడుగే కాదు.. కుక్కలకు రక్షణగా దాన్ని పట్టిన తరుణ్ మనసు కూడా పెద్దదే అంటూ అభినందనలు తెలిపారు.