కర్ణాటక: ఇంట్లో కడు పేదరికం, నాలుగు అన్నం మెతుకులు దొరకడం కష్టమే. ఇలాంటి పరిస్థితుల్లో ఓ అమ్మాయి బిచ్చమెత్తుతూ ఆకలి తీర్చుకునేది. కానీ చదువులో మాత్రం మేటి, ఎస్ఎస్ఎల్సీ ఫలితాలలో 84 శాతం మార్కులతో పాసైంది. కలబుర్గి జిల్లా అళంద తాలూకా మాదన హిప్పరిగి ప్రభుత్వ పబ్లిక్ పాఠశాల విద్యార్థిని సుజాత భీమేష్ ఘనత ఇది.
ఆకలి మంటలతోనే అక్షర యాత్ర గావించి అందరి ప్రశంసలనూ అందుకుంటోంది. గొల్ల సముదాయానికి చెందిన సుజాత ఇల్లు ఓ రేకుల షెడ్డు, తల్లిదండ్రులు కూలీ పనిచేస్తారు. ఇంట్లో అన్నం లేని రోజున గిన్నె పట్టుకుని యాచిస్తుంది. స్కూలుకు వెళ్లి శ్రద్ధగా చదువుకునే ఆమెకు సరస్వతీ కటాక్షం దొరికింది. సుజాత ఫస్టు క్లాసులో పాస్ కావడంతో పాఠశాల ఉపాధ్యాయులు, స్థానికులు ఆమె ఇంటికెళ్లి సన్మానించారు.


