Real Life Story: Share Husband Each Three Days Agreement Void According To Law - Sakshi
Sakshi News home page

రియల్‌ స్టోరీ: ఏవండీ.. ఆవిడొచ్చింది! అంటే చట్టప్రకారం చెల్లుతుందా?

Mar 16 2023 6:28 PM | Updated on Mar 16 2023 7:22 PM

Share Husband Each Three Days Agreement Void According To Law - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

లాక్‌డౌన్‌లో భార్యను దూరం పెట్టి మరీ రెండో పెళ్లి, బిడ్డను కనేశాడు..

సినిమా వేరు.. నిజ జీవితం వేరు. సినిమాల్లో మాదిరి చేద్దామనుకుంటే చట్టాలు తొక్కిపడేస్తాయి. కాదని ముందుకు వెళ్తే.. కఠిన చర్యలకు, శిక్షలకు దారి తీస్తాయి. అలా చట్టాన్ని పట్టించుకోకుండా ముందుకు అడుగేసిన ఇద్దరు భార్యల ముద్దుల మొగుడి వాస్తవ గాథే ఇది.

ఈవీవీ డైరెక్షన్‌లో వచ్చిన ఏవండి.. ఆవిడవచ్చింది చిత్రం గుర్తుందా? అందులో ఇద్దరు పెళ్లాల ముద్దుల భర్తగా సోగ్గాడు శోభన్‌బాబు, భార్యలుగా వాణిశ్రీ, శారదలు ప్రేక్షకులను అలరించారు. వారంలో చెరో మూడు రోజులు భార్యల దగ్గర.. మరో రోజు ప్రశాంతంగా తల్లిదండ్రుల దగ్గర గడిపే వెసులుబాటు ఉంటుంది ఆ సినిమాలో హీరోకి. కానీ, రియల్‌ లైఫ్‌లో అలా చేస్తామంటే కుదురుతుందా? అలాంటి పరస్పర ఒప్పందాలు చట్టప్రకారం చెల్లుతాయా?

గురుగ్రామ్‌కు చెందిన ఓ ఇంజినీర్‌.. 2018లో గ్వాలియర్‌కు చెందిన ఓ మహిళను పెళ్లాడాడు. రెండేళ్లు కాపురం చేశారు వాళ్లు. అయితే.. కరోనా టైంలో(2020లో) వైరస్‌ భయానికి ఆమెను పుట్టింటికి పంపాడు. అయితే వైరస్‌ ఉధృతి తగ్గాక మళ్లీ ఈమెను తీసుకెళ్లేందుకు పోనేపోలేదు ఆ వ్యక్తి. రెండేళ్లపాటు రకరకాల సాకులు చెబుతున్న భర్త తీరుపై ఆమెకు అనుమానం కలిగింది. ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఉన్నపళంగా ఒక్కతే గురుగ్రామ్‌కు వెళ్లింది. అలా వెళ్లిన ఆమెకు పెద్ద షాకే తగిలింది. 

కరోనా టైంలోనే ఆఫీస్‌లో ఓ కొలీగ్‌ అమ్మాయిని ప్రేమించి-పెళ్లి చేసుకోవడమే కాదు.. ఏకంగా ఆ టైంలో ఆమె ద్వారా ఓ బిడ్డను కూడా కనేశాడు ఆ ప్రబుద్దుడు. దీంతో ఆమె ఆఫీస్‌ వద్దే నిరసనకు దిగింది. ఆపై తనకు న్యాయం కావాలంటూ గ్వాలియర్‌లోని ఫ్యామిలీ కోర్టుకు ఆశ్రయించింది. దీంతో సమన్లు జారీ చేసిన ఫ్యామిలీ కోర్టు.. అతనికి కౌన్సెలింగ్‌ ఇచ్చేందుకు యత్నించింది. అయినా కూడా రెండో భార్యను విడిచిపెట్టేందుకు అతను ససేమీరా అన్నాడు. 

దీంతో.. ఈసారి ఆ ఇద్దరు భార్యలను కూర్చోపెట్టి కౌన్సిలింగ్‌ ఇచ్చేందుకు ప్రయత్నించారు. కానీ, వాళ్లు కూడా పరిస్థితిని అర్థం చేసుకోలేదు. చివరికి.. ఆ ముగ్గురు ఓ అండర్‌స్టాండింగ్‌కు వచ్చారు. వారంలో మూడు రోజులు ఒకరి దగ్గర, మూడు రోజులు మరొకరి దగ్గర గడపడం.. మిగిలిన ఆదివారం ఒక్కరోజును ఆ భర్త ఛాయిస్‌కు వదిలేశారు. ఇక ఒప్పందంలో భాగంగా.. ఇద్దరికీ ఉండేందుకు చెరో ఫ్లాట్‌ను ఇవ్వడంతో పాటు జీతం చెరిసమానంగా పంచాలని నిర్ణయించుకున్నాడు.  అయితే.. 

ఈ ఒప్పందం చట్టప్రకారం చెల్లుబాటు కాదంటున్నారు వాళ్లకు కౌన్సెలింగ్‌ నిర్వహించిన  న్యాయవాది హరీష్‌ దివాన్‌. ఇది పరస్పర అంగీకారంతో ముగ్గురు చేసుకున్న ఒప్పందం. ఇందులో కోర్టు పాత్రగానీ, కౌన్సిలర్‌ ప్రమేయంగానీ ఏమీ లేదు. ఈ ముగ్గురు హిందువులు. హిందూ చట్టాల ప్రకారం.. ఇలాంటి ఒప్పందం చెల్లదు. చట్టం ప్రకారం.. ఒక హిందువు ఒక భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాతే మరోకావిడను వివాహం చేసుకుంటేనే చెల్లుతుంది. కానీ, వీళ్లు తమ మానానా తాము ఒప్పందం  చేసుకున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే వాళ్ల మీద చర్యలు ఉండొచ్చు అని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement