రథయాత్రలో తొక్కిసలాట | Puri stampede: Three dead and over 50 injured during Jagannath Rath Yatra | Sakshi
Sakshi News home page

రథయాత్రలో తొక్కిసలాట

Jun 30 2025 3:32 AM | Updated on Jun 30 2025 3:32 AM

Puri stampede: Three dead and over 50 injured during Jagannath Rath Yatra

రథయాత్రలో తొక్కిసలాట దృశ్యం

పూరీలో విషాదం

ముగ్గురి మృతి

50 మందికి గాయాలు

పూరీ: ఒడిశాలో విఖ్యాత  పూరీ జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున 4.20 గంటల సమయంలో గుండిచా ఆలయం ఎదుట తొక్కిసలాట జరగడంతో ముగ్గురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. 50 మంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించామని, ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. మృతుల్లో ఇద్దరు మహిళలు.

మూడు రథాల్లో కొలువుదీరిన జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రను దగ్గరి నుంచి తిలకించడానికి గుండిచా ఆలయం వద్ద భక్తులు ఇసకేస్తే రాలనంతగా గుమిగూడారు. అంతలో యాత్రా సామగ్రితో రెండు ట్రక్కులు జనం మధ్యలోకి దూసుకొచ్చాయి. దాంతో భయాందోళనకు గురై వారంతా ఒక్కసారిగా చెల్లాచెదురయ్యారు. ఒకరిపై ఒకరు పడిపోయారు. తొక్కిసలాటలో బోలాగఢ్‌కు చెందిన బసంతి సాహూ (36), బాలిపాట్నాకు చెందిన ప్రేమకాంత్‌ మొహంతీ (80), ప్రవతి దాస్‌ (42) మరణించారు. 

అధికారులపై వేటు  
తొక్కిసలాటపై ఒడిశా ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. తొక్కిసలాటకు బాధ్యులుగా జిల్లా కలెక్టర్‌ సిద్ధార్థ శంకర్‌ స్వయిన్, ఎస్పీ వినీత్‌ అగర్వాల్‌పై బదిలీ వేటు వేశారు. డీసీపీ బిష్ణు పాటీ, కమాండెంట్‌ అజయ్‌ పాధీని సస్పెండ్‌ చేశారు. ఘటనపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు. జగన్నాథుడి భక్తులు క్షమించాలంటూ ‘ఎక్స్‌’లో సీఎం పోస్టు చేశారు. రథయాత్రలో తొక్కిసలాటకు భద్రతా లోపాలే కారణమని దర్యాప్తులో తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం అందజేయనున్నట్లు ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. రథయాత్ర ఇన్‌చార్జిగా సీనియర్‌ అధికారి అరవింద్‌ అగర్వాల్‌ను నియమించింది.

పరిస్థితి అదుపులోకి వచి్చందని న్యాయ మంత్రి పృథ్వీరాజ్‌ హరిచందన్‌ వెల్లడించారు. తొక్కిసలాటలో భక్తులు మరణించడం మనసును కలచివేసిందని పూరీ రాజు, శ్రీజగన్నాథాలయ మేనేజింగ్‌ కమిటీ చైర్మన్‌ గజపతి మహారాజా దివ్యసింగ్‌ దేవ్‌ చెప్పారు. ఇవి పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌ గాందీ, ఒడిశా మాజీ సీఎం నవీన్‌ పటా్నయక్‌ తదితరులు సంతాపం ప్రకటించారు.

ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఘోరం జరిగిందని విమర్శించారు. పూరీలో రథయాత్ర శుక్రవారం ప్రారంభమైంది. సంప్రదాయం ప్రకారం మూడు రథాలు ప్రధానాలయం నుంచి 2.6 కిలోమీటర్ల దూరంలోని గుండిచా మందిరానికి శనివారం చేరుకున్నాయి. గుండిచా మాతను జగన్నాథ, బలభద్ర, సుభద్రల తల్లిగా భావిస్తారు. రథాలు జూలై 5 దాకా అక్కడే ఉంటాయి. అనంతరం బహుదా యాత్ర ద్వారా ఆలయంలోకి తిరుగు ప్రయాణం అవుతాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement