పుణే ఆస్పత్రి వద్ద హైడ్రామా
బాంబు ఉందని సమాచారం అందుకోవడం.. ముసుగులేసుకుని స్క్వాడ్లు అక్కడికి చేరుకోవడం.. ఏ వైర్ తెంపాలో అనే ఉత్కంఠ చివరిదాకా.. ఇలాంటి సీన్లు సినిమాల్లో ఎక్కువగా చూస్తుంటాం. అయితే.. మహారాష్ట్ర పుణేలో ఈ తరహాలోనే ఓ ఘటన జరిగింది. ఓ ఆస్పత్రి ఆవరణలో లైవ్ బాంబు బయటపడడం తీవ్ర కలకలం రేపింది.
పుణే సిటీలోని హడప్సర్ కామధేను ఎస్టేట్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బుధవారం ఉదయం బాంబు బయటపడింది. తొలుత అనుమానాస్పద వస్తువుగా భావించినప్పటికీ.. ఆ తర్వాత అది టైమర్ బాంబ్ అని తేలడంతో అందరి గుండెలు గుభేల్మన్నాయ్. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ (BDDS), అగ్నిమాపక సిబ్బంది, డాగ్ స్క్వాడ్ను సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఆసుపత్రి పరిసరాలను ఖాళీ చేయించి భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు.
ఈ పరిణామాలు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. అయితే.. పరిశీలనలో అది 7 గంటల తర్వాత పేలేలా టైమర్తో అమర్చిన లైవ్ బాంబు అని తేలింది. బీడీడీఎస్ సిబ్బంది బాంబును సురక్షిత ప్రదేశానికి తరలించి.. ఓపెన్ ఫీల్డ్లో నిర్వీర్యం చేశారు. బాంబులో తక్కువ శక్తి గల పేలుడు పదార్థం ఉందని నిర్ధారించారు.
"నగరంలో తక్కువ శక్తి గల IED (ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోసివ్ డివైస్) కనుగొనబడింది. దానిని నిర్వీర్యం చేశాం. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది." అని పుణే పోలీస్ కమిషనర్ నితేష్ కుమార్ తెలిపారు. క్రైమ్ బ్రాంచ్, స్థానిక పోలీసులు కలిసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.


