చెన్నై: విమానం నుంచి దూకడం అంటే అది నిజంగా చాలా ప్రమాదకరమైన చర్య. అయినప్పటికీ, ప్రపంచంలో కొన్ని అరుదైన సంఘటనల్లో ప్రయాణికులు ఎమర్జెన్సీ ఎగ్జిట్ తలుపు తెరిచి బయటకు దూకిన సందర్భాలు లేకపోలేదు. తాజాగా చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడు విమానం నుంచి దూకిన ఘటన చోటు చేసుకుంది. విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో అస్వస్థతకు గురైన ఆ ప్రయాణికుడు.. ఎమర్జెన్సీ డోర్ తెరిచి కిందికి దూకేశాడు.
ఈరోజు(ఆదివారం, మే 3వ తేదీస్త్ర తెల్లవారుజామున ఎయిర్ అరేబియా విమానం చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా ఓ ప్రయాణికుడు వాంతులు చేసుకున్నాడు. ఇలా రెండుసార్లు వాంతులు చేసుకున్న తర్వాత భయపడి పోయిన సదరు ప్రయాణికుడు.. అత్యవసర ద్వారం ఓపెన్ చేసి అక్కడ నుంచి కిందకు దూకేశాడు.
విమానం ల్యాండ్ అయ్యి టాక్సీవేపై కదులుతున్న సమయంలో కాబట్టి ఆ ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడినట్లు విమానాశ్రయ అదికారులు తెలిపారు. ఆ ప్రయాణికుడు విమానం నుంచి దూకిన వెంటనే సీఐఎస్ఎఫ్ సిబ్బంది వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కాకపోతే స్వల్పంగా గాయపడినట్లు పేర్కొన్నారు. అతనికి ప్రాథమిక చికత్స అందించారు. ఈ ఘటనతో ప్రధాన రన్వే ఒక గంట పాటు మూసేశారు. కొన్ని విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయి.
ప్రయాణికుడు విమానంలో రెండు సార్లు వాంతులు చేసుకున్నాడని అధికారులు తెలిపారు. ఇది అతని మానసిక, శారీరక స్థితి ప్రభావం కావచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంచితే, సాధారణంగా బలమైన లాకింగ్ సిస్టమ్ ఉండే ఎమర్జెన్సీ ఎగ్జిట్ తలుపు ఎలా తెరవగలిగాడు? అనే కోణంలో దర్యాప్తు జరుగుతుంది. భద్రతా లోపాలు ఉన్నాయా? అనే కోణంతో పాటు ప్రయాణికుడి మానసిక స్థితిని పరీక్షీస్తున్నారు.


