Operation Meghchakra: సీబీఐ పాన్‌ ఇండియా మెరుపు దాడులు.. ఆపరేషన్‌ మేఘ్‌చక్ర ఎందుకంటే..

Operation Meghchakra: CBI Raids For Tip On Child Abuse Content - Sakshi

ఢిల్లీ: తెలుగు రాష్ట్రాలతో సహా దేశంలో పలు చోట్ల ఇవాళ కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ మెరుపు దాడులకు దిగింది. పిల్లలపై లైంగిక వేధింపుల కంటెంట్‌ను గుర్తించేందుకు, ఆ కంటెంట్‌తో మైనర్లపై బ్లాక్‌మెయిల్‌కు దిగుతున్న ముఠాల పని పట్టేందుకు ఆపరేషన్‌ ‘మేఘ్‌చక్ర’ను నిర్వహిస్తోంది. ఈ మేరకు శనివారం దేశవ్యాప్తంగా సోదాలు మొదలుపెట్టింది.

మొత్తం పంతొమ్మిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి దాదాపు 56 చోట్ల సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ దాడులు కొనసాగుతున్నాయి. మైనర్లపై లైంగిక వేధింపుల మెటీరియల్‌కు సంబంధించిన సమాచారం అందిన నేపథ్యంలోనే ఈ దాడులు కొనసాగినట్లు తెలుస్తోంది. అయితే ఎంతమందిని అదుపులోకి తీసుకుంది.. ఇతరత్ర పరిణామాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

సింగపూర్‌ ఇంటర్‌పోల్‌ విభాగం నుంచి అందిన పక్కాసమాచారం మేరకే ఈ సెర్చ్‌ ఆపరేషన్‌ను మొదలుపెట్టింది సీబీఐ. పిల్లల లైంగిక వేధింపుల మెటీరియల్‌ను పంపిణీ చేయడం, వాటి ఆసరాగా మైనర్‌లను బ్లాక్‌మెయిల్ చేసే వ్యక్తులను, ముఠాలను గుర్తించడం.. చర్యలు తీసుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది సీబీ‘ఐ’.

పిల్లల అశ్లీల విషయాలను ప్రసారం చేయడానికి ఉపయోగించే క్లౌడ్ స్టోరేజీ సౌకర్యాలను లక్ష్యంగా చేసుకుని నిరుడు సీబీఐ చేపట్టిన ‘ఆపరేషన్ కార్బన్’కు మేఘ్‌చక్ర కొనసాగింపు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. చైల్డ్‌ పోర్నోగ్రఫీకి సంబంధించిన కేసులను పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన యంత్రాంగంపై వివరణాత్మక నివేదికను సమర్పించాలని గత వారం సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది కూడా.

ఇదీ చదవండి: ఘోర ప్రమాదం.. గోడ కూలి 10 మంది దుర్మరణం!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top