నేపాల్ అభ్యంతరం.. కొట్టేసిన భారత్
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్లోని లిపులెఖ్ కనుమ మీదుగా చేపట్టే కైలాశ్ మానస సరోవర్ యాత్రపై నేపాల్ అభ్యంతరం చెప్పడాన్ని భారత్ ఖండించింది. ఏకపక్షంగా, కృత్రిమంగా విస్తరించుకుని భూభాగాలపై హక్కులను ప్రకటించడం ఏమాత్రం సమర్థనీయం కాదని స్పష్టం చేసింది.
జూన్ నుంచి ఆగస్ట్ వరకు మానస సరోవర్ యాత్ర జరుగుతుందని గత వారం విదేశాంగ శాఖ ప్రకటించింది. అయితే, తమను ఏమాత్రం సంప్రదించకుండా భారత్, చైనాలు లిపులేఖ్ మీదుగా మానస్ సరోవర్ యాత్రకు ఏర్పాట్లు చేస్తుండటాన్ని ఖండిస్తూ నేపాల్ విదేశాంగ శాఖ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది.
లిపులెఖ్ తమ భూభాగమని పేర్కొంది. దీనిపై కొద్ది గంటల్లోనే భారత్ స్పందించింది. ‘ఈ విషయంలో భారత్ వైఖరి స్థిరంగా, స్పష్టంగా ఉంది. లిపులెఖ్ కనుమ 1954 నుంచి కైలాస మానస సరోవర యాత్రకు పురాతన మార్గంగా ఉంటోంది. దశాబ్దాలుగా అదే మార్గంలో యాత్ర కొనసాగుతోంది’అని విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. నేపాల్ చేస్తున్న వాదనలు ఏమాత్రం సమర్థనీయం కాదని చెప్పా రు. వాటికి చారిత్రక ఆధారాలు లేవన్న విషయాన్ని భారత్ మొదట్నుంచీ చెబుతూనే ఉందన్నారు.


