Lok Sabha Election 2024: ప్రత్యర్థులుగా తలపడ్డా... చెక్కు చెదరని స్నేహం | Lok Sabha Election 2024: A friendship that can't be broken even if they are rivals | Sakshi
Sakshi News home page

Lok Sabha Election 2024: ప్రత్యర్థులుగా తలపడ్డా... చెక్కు చెదరని స్నేహం

May 12 2024 4:36 AM | Updated on May 12 2024 4:36 AM

Lok Sabha Election 2024: A friendship that can't be broken even if they are rivals

ఎన్నికల ప్రచారం అనగానే ప్రత్యర్థులపై, అవతలి పారీ్టపై విమర్శలు సహజం. చాలాసార్లు పరిస్థితి వ్యక్తిగతంగా తిట్ల దండకాల దాకా వెళ్తుంది. కానీ ప్రత్యర్థులిద్దరూ మంచి స్నేహితులైతే? 1952 తొలి లోక్‌సభ ఎన్నికల్లో అలాగే జరిగింది. స్నేహితులిద్దరూ ఒకే నియోజకవర్గం నుంచి పోటీ పడ్డారు. 

ప్రచారం చేసుకున్నారు. అయినా మంచి స్నేహితులుగానే మిగిలారు. వాళ్లే ప్రముఖ కాంగ్రెస్‌ నేత విష్ణు గాడ్గిల్, పిజెంట్స్‌ అండ్‌ వర్కర్స్‌ పార్టీ లీడర్‌ కేశవరావ్‌ జేఢే. సోషలిస్ట్‌ వెటరన్‌ బాబా అధవ్‌ ఆ ప్రచారంలో పాల్గొన్నారు. అప్పటికాయనకు 22 ఏళ్లు. నాటి రోజులను గుర్తు చేసుకుంటూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. 

‘‘గాడ్గిల్‌పై తిలక్‌ ప్రభావం ఎక్కువ. కాంగ్రెస్‌లో బ్రాహ్మణ శ్రేణి ప్రముఖునిగా ఉండేవారు. మరాఠ్వాడాకు చెందిన జేఢే బహుజన ఉద్యమ భాగస్వామి. జ్యోతిరావు ఫూలే స్థాపించిన సత్యశోధక్‌ సమాజ్‌తో కలిసి పనిచేశారు. బ్రాహ్మణవాదానికి అతి పెద్ద విమర్శకుడు. 1920ల్లో వారిద్దరూ ప్రత్యర్థులు. స్వాతంత్య్రోద్యమంలో జైలుపాలయ్యాక మంచి స్నేహితులయ్యారు. 

దళితుల కోసం పార్వతి ఆలయాన్ని తెరవడానికి 1929లో అంబేడ్కర్‌ నడిపిన ఉద్యమంలో పాలుపంచుకున్నారు. 1934లో రెండు కేంద్ర అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్‌ తరఫున ఎన్నికయ్యారు. గాడ్గిల్‌ మద్దతుతో జేఢే 1938లో మహారాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడయ్యారు. 1947లో కాంగ్రెస్‌ను వీడి పీడబ్ల్యూపీని స్థాపించారు. తొలి సార్వత్రిక ఎన్నికల్లో పుణే సెంట్రల్‌ నుంచి గాడ్గిల్‌పైనే పోటీ చేయాల్సి వచి్చంది. 

ప్రత్యర్థులుగా మారినా ప్రచారంలో పరస్పర దూషణల వంటివి అస్సలుండేవి కాదు. ప్రసంగాలూ స్నేహపూర్వకంగానే సాగేవి. ఒక్కోసారి అభ్యర్థులంతా ఒకే వేదిక నుంచి ప్రచారం చేసేవారు. మొదట జేఢే, తరువాత గాడ్గిల్, చివరికి  సోషలిస్టు పార్టీ అభ్యర్థి ఎస్‌.ఎమ్‌.జోషి మాట్లాడేవారు. ఒకరినొకరు నిందించుకోలేదు. పారీ్టలను తిట్టుకోలేదు. కులపరంగా ఓట్లడగలేదు. కేవలం హామీలపైనే దృషి సారించి ప్రచారం చేశారు. గాడ్గిల్‌కు 102,692 ఓట్లు, జేఢేకు 42,200 ఓట్లొచ్చాయి’’ అని అధవ్‌ తెలిపారు. 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 
 

Advertisement
 
Advertisement
Advertisement