‘అగ్నివీర్‌’ల పరిహారంపై అసత్యాలు.. ఖండించిన ఇండియన్‌ ఆర్మీ | Indian Army Responds On Agniveer Ajay Kumar's Compensation | Sakshi
Sakshi News home page

‘అగ్నివీర్‌’ల పరిహారంపై అసత్యాలు.. ఖండించిన ఇండియన్‌ ఆర్మీ

Jul 4 2024 3:38 PM | Updated on Jul 4 2024 4:19 PM

Indian Army Responds On Agniveer Ajay Kumar's Compensation

సాక్షి,న్యూఢిల్లీ : విధి నిర్వహణలో మరణించిన అగ్నివీర్‌ అజయ్‌ కుమార్‌ కుటుంబానికి చెల్లించిన నష్ట పరిహారంపై సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారాన్ని ఇండియన్‌ ఆర్మీ ఖండించింది.  

ఇప్పటికే అగ్నివీర్‌ అజయ్‌ కుటుంబానికి ఇప్పటి వరకు మొత్తం రూ.98.39 లక్షలు అందించినట్లు ఆర్మీ స్పష్టం చేసింది. అగ్నివీర్‌ పథకంలోని నిబంధనల మేరకు అగ్నివీర్‌లో మరణించిన వారి తరుపున కుటుంబానికి రూ.1.65 కోట్లు పరిహారంగా అందిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం అగ్నివీర్‌ అజయ్‌ కుమార్‌ కుటుంబానికి రూ.98.39 లక్షలు ఇచ్చామని, పోలిస్‌ వెరిఫికేషన్‌ అనంతరం రూ.67 లక్షల వరకు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మొత్తం రూ.1.65కోట్లు అవుతుందని ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేసింది.  

దేశం కోసం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నివీర్‌ అజయ్‌ కుమార్‌ త్యాగానికి సెల్యూట్‌ అంటూ ఆయనకు ప్రగాఢ సంతాపం తెలిపింది.  


అజయ్‌ కుమార్‌ లేని లోటు తీర్చ లేనిది
అంతకుముందు అగ్నివీర్‌ అజయ్‌ కుమార్‌ మరణంపై ఆయన కుటుంబ సభ్యులు స్పందించారు. విధి నిర్వహణలో మరణించిన అజయ్‌ కుమార్‌ సేవలకు గాను ఇండియన్‌ ఆర్మీ ‘హీరో’ గుర్తింపు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.  ప్రభుత్వం ఇచ్చే పరిహారం అజయ్‌ కుమార్‌ లేని లోటును తీర్చలేదని తండ్రి, అక్క విచారం వ్యక్తం చేశారు.

అగ్నివీర్‌ను రద్దు చేయాలి.. 
ఈ సందర్భంగా అజయ్‌ కుమార్‌ అక్క జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘నా తమ్ముడు అజయ్‌ కుమార్‌ అగ్నివీర్‌గా నాలుగేళ్లు విధులు నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా రూ.కోటి పరిహారం నా తమ్ముడు లేని లోటును తీరుస్తుందా? ఆయన లేకుండా నా కుటుంబం ఎలా జీవిస్తుంది’అని ప్రశ్నించారు. ప్రభుత్వం పరిహారం చెల్లించింది. కానీ అగ్నివీర్‌ పథకాన్ని రద్దు చేయాలనేది మా డిమాండ్‌ అని తెలిపారు.  

స్పందించిన రాహుల్‌ గాంధీ
అజయ్‌ కుమార్‌ తండ్రి మాత్రం అగ్నివీర్‌ మరణం అనంతరం ప్రభుత్వం అందించే పరిహారం రూ.1.65కోట్లు అందలేదని చెప్పారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. పరిహారం చెల్లించే విషయంలో  రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అబద్ధాలాడారని రాహుల్‌ గాంధీ మండి పడ్డారు. వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తూ ఓ వీడియోను షేర్‌ చేశారు.  

తాజాగా పరిణామాల నేపథ్యంలో పరిహారంపై ప్రచారం అవుతున్న అసత్యాల్ని ఇండియన్‌ ఆర్మీ ఖండించింది.  

Advertisement
 
Advertisement
Advertisement