సాక్షి, న్యూఢిల్లీ: వాహనదారులకు మళ్లీ షాక్ తగిలింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ఆయిల్ కంపెనీలు 90 పైసల చొప్పున పెంచేశాయి. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో చమురు ధరలు మళ్లీ పెరిగిన దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పెరిగిన ధరలు ఇవాళ్టి నుంచే అమలుకానున్నాయి.
ఇటీవలె రెండింటిపైనా రూ.3 చొప్పున పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పెట్రోల్పై 86 పైసలు, డీజిల్పై 83 పైసలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ లెక్కన నాలుగు రోజుల వ్యవధిలో రెండుసార్లు పెరిగాయన్నమాట.

పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్తో.. భారత ప్రభుత్వానికి చెందిన ఆయిల్ కంపెనీలు (IOCL, BPCL, HPCL) అధిక ధరలకు క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నాయి. ఇప్పటిదాకా ఆ భారాన్ని వినియోగదారులపై వేయకుండా రోజుకు సుమారు రూ.1,600 కోట్ల నష్టాన్ని భరించాయి. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంచేందుకు కేంద్రం కూడా ఇంధన ధరలు పెంచకుండా ఆగింది. కానీ..
దీర్ఘకాలంగా కొనసాగుతున్న అమెరికా–ఇరాన్ యుద్ధం, హర్ముజ్ జలసంధి దిగ్బంధనం కారణంగా నౌకా రవాణా ఆగిపోవడంతో చమురు, వాయువు సరఫరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇంధన ధరల పెరుగుదల తప్పనిసరి అయింది. అయితే మరోసారి యుద్ధ వాతావరణం నెలకొనడం.. హర్ముజ్ ఉద్రిక్తతలు చల్లారకపోవడంతో ఈ పెంపు ఇక్కడితో ఆగకపోవచ్చని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

✔️ తాజా పెంపు తర్వాత ప్రధాన నగరాల్లో కొత్త ధరలు ఇలా ఉన్నాయి:
ఢిల్లీ: పెట్రోల్ ₹98.63, డీజిల్ ₹91.50
ముంబై: పెట్రోల్ ₹107.40, డీజిల్ ₹93.86
హైదరాబాద్: పెట్రోల్ ₹111.36, డీజిల్ ₹99.53
కోల్కతా: పెట్రోల్ ₹109.31, డీజిల్ ₹95.85
చెన్నై: పెట్రోల్ ₹104.66, డీజిల్ ₹96.22
బెంగళూరు: పెట్రోల్ ₹106.82, డీజిల్ ₹94.82
పాట్నా: పెట్రోల్ ₹109.40, డీజిల్ ₹95.61
జైపూర్: పెట్రోల్ ₹108.89, డీజిల్ ₹94.32
తిరువనంతపురం: పెట్రోల్ ₹111.24, డీజిల్ ₹100.09
చండీగఢ్: పెట్రోల్ ₹98.16, డీజిల్ ₹86.28


