- క్యాండీ చోరీ చేసిందని కూతురిని కొట్టి చంపిన తండ్రి
బులంద్షహర్: ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. క్యాండీ ప్యాకెట్ చోరీ చేసిందని కుమార్తెను కర్రతో కొట్టి చంపాడు ఓ తండ్రి. అతడిని ఇవాళ (మార్చి 29న) అరెస్ట్ చేసిన పోలీసులు వివరాలు తెలిపారు.
నిందితుడిని పోలీసులు పుష్పేంద్ర అలియాస్ పప్పు శర్మగా గుర్తించారు. మార్చి 27న రతన్పూర్ గ్రామంలో పుష్పేంద్ర భార్య ఆర్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఫిర్యాదులో ఆర్తి పేర్కొన్న వివరాల ప్రకారం.. తన కుమార్తె(12)పై పుష్పేంద్ర కర్రతో దాడి చేయడంతో ఆమె మరణించింది.
అంతకుముందు పుష్పేంద్ర వద్దకు స్థానిక దుకాణదారుడు వచ్చాడు. పుష్పేంద్ర కుమార్తె క్యాండీ ప్యాకెట్ తీసుకుందని చెప్పాడు. దీంతో ఆగ్రహానికి గురైన పుష్పేంద్ర తన కుమార్తెను ఓ కర్రతో చావబాదాడు. దీంతో ఆ బాలిక దెబ్బలకు తాళలేక ప్రాణాలు కోల్పోయింది.
ఆర్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నరోరా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ గంగా ప్రసాద్ ఆర్యా మాట్లాడుతూ.. పుష్పేంద్ర ఉపయోగించిన కర్రను కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ కేసుపై పోలీసులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.
కేవలం క్యాండీ చోరీ చేసినందుకు కుమార్తెను తండ్రి చంపిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆ సమయంలో ఆ తండ్రిని గుర్తించి బాలికను కొట్టకుండా ఎవరైనా ఆపి ఉంటే ఆమె ఇప్పుడు బతికి ఉండేదని స్థానికులు చెప్పుకుంటున్నారు.


