‘తప్పయింది.. నన్ను క్షమించండి’, సుప్రీం కోర్టులో బాబా రాందేవ్‌ | Baba Ramdev Apologises To Supreme Court In Misleading Ads Case | Sakshi
Sakshi News home page

‘తప్పయింది.. నన్ను క్షమించండి’, సుప్రీం కోర్టులో బాబా రాందేవ్‌

Apr 2 2024 5:10 PM | Updated on Apr 2 2024 5:43 PM

Baba Ramdev Apologises To Supreme Court In Misleading Ads Case - Sakshi

న్యూఢిల్లీ : ప్రముఖ యోగా గురు, పతంజలి ఆయర్వేద కో-ఫౌండర్‌ బాబా రాందేవ్‌, ఆ కంపెనీ సీఈఓ ఆచార్య బాలకృష్ణలను సుప్రీం కోర్టు మందలించింది. పతంజలిపై కేంద్రం సైతం ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు ఎందుకు ఉందని ప్రశ్నించింది. 

బాబా రాందేవ్‌ గతంలో.. కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ వేసుకున్న కొందరు మరణిస్తున్నారు. అల్లోపతి వైద్య విధానం 100 శాతం పనిచేయలేదనడానికి ఇదే నిదర్శనమంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత వైద్య సంఘం (ఐఎంఎ) గత ఏడాది సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై అత్యున్నత న్యాయ స్థానం పలు మార్లు విచారణ చేపట్టింది.

అఫిడవిట్‌ దాఖలు చేయాలంటూ
చివరిసారి ఫిబ్రవరిలో జరిపిన విచారణలో భాగంగా పతంజలి తప్పుడు ప్రకటనలు ఇవ్వొద్దని ఆదేశించింది. నిబంధనల్ని ఉల్లంఘిస్తే ఒక్కో ఉత్పత్తిపై రూ.కోటి జరిమానా విధించాల్సి ఉంటుందని హెచ్చరించింది. మెడిక‌ల్ యాడ్స్ కేసులో కొత్త అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని స్పష్టం చేసింది.   

కోర్టు ధిక్కరణ తగదు
తాజాగా, అఫిడవిట్‌ దాఖలు చేయడంతో పాటు బాబా రామ్‌ దేవ్‌, ఆచార్య బాలకృష్ణలు స్వయంగా సుప్రీం కోర్టుకు హాజరయ్యారు. విచారణ సమయంలో సుప్రీం కోర్టు జస్టిస్‌ హిమ కోహ్లీ, జస్టీస్‌ అహ్సానుద్దీన్ అమానుల్లా ధర్మాసనం మరోసారి బాబారామ్‌ దేవ్‌, ఆచార్య బాలకృష్ణలు న్యాయాస్థానాన్ని ధిక్కరించేలా వ్యవహరిస్తున్నారని తెలిపింది.  అంతేకాదు ఆధునిక వైద్యం కోవిడ్‌-19 వైరస్‌లను నయం చేయలేవన్న బాబా రామ్‌ దేవ్‌ వ్యాఖ్యలపై కేంద్రం కళ్లు మూసుకుని కూర్చుందని వ్యాఖ్యానించింది. 

అఫిడవిట్‌ ‘అవాస్తవం’,‘మోసం’
గత నెలలో యాడ్స్‌కు బేషరతుగా క్షమాపణలు చెబుతూ అఫిడవిట్ దాఖలు చేసినందుకు రాందేవ్, బాలకృష్ణపై కోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. అఫిడవిట్‌ను ‘అవాస్తవం’,‘మోసం’గా అభివర్ణించింది.  అంతేకాదు, పతంజలి గత ఏడాది తప్పుదోవ పట్టించేలా యాడ్స్‌ ఇవ్వడంపై స్పందించింది. తాము (కోర్టు) ఇచ్చిన ఆదేశాల గురించి పతంజలి మీడియా యూనిట్‌(pmpl) కు తెలియదన్న వాదన తోసిపుచ్చింది.

నన్ను క్షమించండి
కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పతంజలి ఆయుర్వేద్ తరపు న్యాయవాది, బాబా రాందేవ్‌లు అత్యున్నత న్యాయస్థానాన్ని క్షమాపణలు కోరారు. క్షమాపణలతో దేశవ్యాప్తంగా ఉన్న కోర్టులు జారీ చేసే ప్రతి ఉత్తర్వును గౌరవించాలి. కోర్టు ఆదేశాల్ని బేఖాతరు చేశారు. ఇది ధిక్కారమే అవుతుందని అని జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

మీకిదే చివరి అవకాశం
బాబా రాందేవ్‌, బాలకృష్ణలకు చివరి అవకాశంగా ఒక వారంలో సరైన పద్ధతిలో అఫిడవిట్‌లను దాఖలు చేయాలి. ఏప్రిల్ 10న కోర్టు విచారణకు మీరిద్దరూ తప్పనిసరిగా హాజరు కావాలి అంటూ సుప్రీం కోర్టు జస్టిస్‌ హిమ కోహ్లీ, జస్టీస్‌ అహ్సానుద్దీన్ అమానుల్లా ధర్మాసనం అనుమతి ఇచ్చింది. 

Advertisement
 
Advertisement
Advertisement