Amit Shah Targets Manmohan Singh's Government - Sakshi
Sakshi News home page

మన్మోహన్ సింగ్ ఓ పిరికిపంద: అమిత్ షా ఫైర్‌

Jun 12 2023 8:46 AM | Updated on Jun 12 2023 10:50 AM

Amit Shah Targets Manmohan Singh Government - Sakshi

విశాఖపట్నం: బీజేపీ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పరిపాలనను పూర్తి చేసుకున్న నేపధ్యంలో విశాఖపట్నం వేదికగా ఆ పార్టీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంతకుముందు అధికారంలో ఉన్న మన్మోహన్ సింగ్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అంతర్గత భద్రత విషయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్నారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే అంతర్గత భద్రత వ్యవహారం పటిష్టంగా తయారైందని అన్నారు.   

ప్రజలు ధైర్యంగా ఉన్నారు.. 
బీజేపీ ప్రభుత్వం 9 ఏళ్ల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్బంగా విశాఖపట్నంలో భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన అమిత్ షా సభనుద్దేశించి మాట్లాడుతూ గత యూపీఏ ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శించారు. అంతర్గత భద్రత విషయంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం చాలా ఉదాసీనంగా వ్యవహరించేది. నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రజలు ధైర్యంగా ఉంటున్నారని అన్నారు.   

దేశంలో తీవ్రవాదాన్ని పెంచేశారు.. 
యూపీఏ ప్రభుత్వ హయాంలో ఆలియా, మాలియా, జమాలియా అనే పద్ధతిలో తీవ్రవాదాన్ని పెంచి పోషించింది. అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కు వారిపై చర్య తీసుకునే ధైర్యం లేదు. శత్రువులు మనపై దాడి చేసినా చేతులు ముడుచుకుని కూర్చునేవారు. నోరు విప్పేవారు కాదు. కానీ ఇప్పుడు మన ప్రధాని అలాంటి సవాళ్ళన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొంటున్నారన్నారు. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తరవాతే దేశ అంతర్గత భద్రత పెంచి ప్రజలకు భరోసా కల్పించారు. 

ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో భారత సైన్యం ఎంతో తెగువతో కేవలం 10 రోజుల వ్యవధిలోనే ఉరి, పుల్వామా సర్జికల్ స్ట్రైక్, ఎయిర్ స్ట్రైక్ లు నిర్వహించి శత్రువులకు ఎదురెళ్లి మరీ భారత దేశ సత్తా ఏంటో చాటిందన్నారు. ఇప్పుడు తీవ్రవాదులు నరేంద్ర మోదీ పేరు వింటేనే భయపడుతున్నారని అన్నారు.      

ఇది కూడా చదవండి: పూణేలో భక్తులపై లాఠీచార్జ్.. ఉత్సవాల్లో అపశ్రుతి   

Advertisement
 
Advertisement
Advertisement