‘రెండో విడత’ పకడ్బందీగా నిర్వహించాలి
నారాయణపేట: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులు కలెక్టర్ సిక్తాపట్నాయక్ సూచించారు. శుక్రవారం కలెక్టర్ చాంబర్లో రెండో విడతలో ఎన్నికలు జరుగనున్న నారాయణపేట, దామరగిద్ద, ధన్వాడ, మరికల్ మండలాల పోలింగ్ సిబ్బంది మూడో ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్, జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకురాలు సీతాలకి్ష్మ్ సమక్షంలో నిర్వహించారు. ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ నిర్వహించిన ఈ ప్రక్రియను కలెక్టర్, అబ్జర్వర్లు నిశితంగా పరిశీలించారు. ఒక్కో మండలం వారీగా ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికల పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. అయితే నామినేషన్ల ఉపసంహరణ నాటికే ఏకగ్రీవమైన సర్పంచ్, వార్డు స్థానాలతో కూడిన గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరపాల్సిన అవసరం లేకపోవడం వల్ల ర్యాండమైజేషన్ ప్రక్రియ నుంచి మినహాయింపు కల్పించారు. స్థానికత, విధులు నిర్వర్తిస్తున్న మండలం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని, ర్యాండమైజేషన్ ద్వారా స్థానికేతర సిబ్బందిని పోలింగ్ విధుల కోసం ఎంపిక చేశారు. రెండో విడతలో 828 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించనుండగా 20 శాతం అదనంగా సిబ్బందిని రిజర్వ్లో ఉంచుతూ ర్యాండమైజేషన్ జరిపారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వర్, జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్రెడ్డి పాల్గొన్నారు.


