
ప్రభుత్వ భూములను గుర్తించండి
● భూ భారతి పోర్టల్లో నిషేధితజాబితాలోకి చేర్చాలి
● తహసీల్దార్ల సమీక్షలో
కలెక్టర్ సిక్తాపట్నాయక్
నారాయణపేట: జిల్లాలో ప్రభుత్వ భూముల సమగ్ర వివరాలను సేకరించి, భూ భారతి పోర్టల్లో నమోదు చేసి వాటిని నిషేధిత జాబితాలోకి చేర్చాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనుతో కలిసి అన్ని మండలాల తహసీల్దార్లతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. మండలాల వారీగా అసైన్డ్ భూము లు, ఎండోమెంట్, వక్ఫ్ బోర్డులు లేదా ఇతర మత సంస్థలకు కేటాయించిన భూములు, సీలింగ్, భూదాన్ భూముల వివరాలను సేకరించాలన్నారు. మండలాల వారీగా ఆయా భూముల వివరాలను తహసీల్దార్లను అడిగి తెలుసుకున్నారు. రెండు రోజుల్లో ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.
వరి కొనుగోలు కేంద్రాల పర్యవేక్షణ తప్పనిసరి
వానాకాలం సీజన్లో జిల్లాలో వరి ధాన్యం దిగుబడి పెరిగే అవకాశం ఉందని, ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాలపై తహసీల్దార్ల పర్యవేక్షణ ఉండాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను ఆదేశించారు. గత సీజన్లో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ముందస్తుగా అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. మండల స్థాయిలో ఏఓ, ఏఈఓ, హార్వెస్టర్ల యజమానులతో తహసీల్దార్లు సమావేశం నిర్వహించి వరి కోతలు, కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా కొనసాగించేలా చూడాలన్నారు. వరి ధ్యానంతో పాటు ఈ సారి పత్తి కొనుగోళ్ల విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగడానికి వీలులేదని, కపాస్ కిసాన్ యాప్లో రైతులు తమ స్లాట్ బుక్ చేసుకునే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో ఆర్డీఓ రామచందర్నాయక్, డిప్యూటీ కలెక్టర్ శ్రీరామ్ ప్రణీత్, డీఏఓ జాన్ సుధాకర్, డీఎంఓ బాలామణి, పౌరసరఫరాల శాఖ అధికారులు సైదులు, బాల్రాజ్, తహసీల్దార్లు పాల్గొన్నారు.