
సర్వర్ కష్టాలు
మరికల్: వర్షాకాలం నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. సర్వర్ సమస్యతో లబ్ధిదారులు రేషన్ దుకాణాల వద్ద గంటల పాటు పడిగాపులు కాచే పరిస్థితి నెలకొంది. ప్రతిరోజు రేషన్ దుకాణాల వద్ద లబ్ధిదారులు ఉదయం నుంచే బారులు తీరుతున్నారు. ఈ నెల 30 తేదీ వరకు సన్న బియ్యం పంపిణీ చేయడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. లబ్ధిదారులు ఎక్కువ సంఖ్యలో రేషన్ దుకాణాలకు వస్తున్నారు. మరోవైపు ఈ–పాస్ యంత్రాల్లో సాంకేతిక సమస్యలు ఏర్పడుతున్నాయని డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం సూచనతో జూన్ 1 నుంచి మూడు నెలల రేషన్ బియ్యాన్ని లబ్ధిదారులకు ఒకేసారి పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో లబ్ధిదారులు, డీలర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొదట నాలుగు రోజులు ఒక్కో లబ్ధిదారుడు ఈ–పాస్ యంత్రంలో మూడు మార్లు వేలి ముద్రలు నమోదు చేయించి, ఆరుమార్లు బియ్యాన్ని తూకం వేయాల్సి వచ్చింది. దీంతో బియ్యం పంపిణీ ప్రక్రియ పూర్తి కావడానికి ఒక్కో లబ్ధిదారుడికి కనీసం 30 నిమిషాల సమయం తీసుకుంటుందని, ఈ విషయంపై రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం నాయకులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం మూడు సార్లు వేలిముద్రలు, మూడు సార్లు బియ్యం తీసుకునేలా మార్పులు చేస్తు సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడంతో సమస్య కొద్దిమేర తగ్గింది. మూడు నెలల బియ్యం ఒకసారి పంపిణీ చేయడం వల్ల రోజుకు 50 కార్డులకు మాత్రమే బియ్యం పంపిణీ సాధ్యమవుతుండగా, గత నెలలో రోజుకు వంద కార్డులకు బియ్యం పంపిణీ జరిగేదని డీలర్లు వాపోతున్నారు.
సన్న బియ్యం కోసం రేషన్ షాపుల వద్ద పడిగాపులు
రోజుకు 50 కార్డులకు మాత్రమే బియ్యం పంపిణీ
ఒక్కో కార్డుకి 20 నిమిషాలు పడుతున్న వైనం
ఈ – పాస్ యంత్రాలతో సాంకేతిక సమస్యలు

సర్వర్ కష్టాలు