అట్రాసిటీ కేసులకు సత్వర పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

అట్రాసిటీ కేసులకు సత్వర పరిష్కారం

Jun 12 2025 3:03 AM | Updated on Jun 12 2025 3:03 AM

అట్రాసిటీ కేసులకు సత్వర పరిష్కారం

అట్రాసిటీ కేసులకు సత్వర పరిష్కారం

నారాయణపేట: ఎస్సీ, ఎస్టీలపై దాడుల నివారణకు ప్రతి నెల చివరి వారంలో పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించాలని రాష్ట్ర షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యుల్డ్‌ తెగల కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌, ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌ ఆధ్వర్యంలో పోలీసు, రెవెన్యూ అధికారులు, ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి, సంక్షేమ శాఖల అధికారులు, కుల సంఘాల నాయకులతో అట్రాసిటీ కేసులలో పురోగతి, సంక్షేమ పథకాల అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషన్‌ చైర్మన్‌ మాట్లాడుతూ.. జిల్లాలో పెండింగ్‌గా ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు సత్వర చర్యలు చేపట్టాలన్నారు. ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్‌యువ వికాసం పథకాల్లో ఎస్సీ, ఎస్టీ కోటా పూర్తి స్థాయిలో ఖచ్చితంగా అమలు పరచాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు పూర్తిగా వారికే కేటాయించాలని నిధులు పక్కదారి పగడకుండా చూడాలని తెలిపారు. ఎక్కడైనా ఎస్సీ, ఎస్టీలకు సమస్యలు ఎదురైతే అక్కడికి కమిషన్‌ వెళ్లి వారి సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తుందని పునరుద్ఘాటించారు. జిల్లా విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ వెంటనే ఏర్పాటుచేస్తామన్నారు.

ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి చర్యలు

కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ మాట్లాడుతూ ..జిల్లా స్థాయిలో వసతి గృహాల నిర్వహణ, విద్యా, వైద్యం అన్ని విభాగాలకు సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం సూచనల మేరకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. షెడ్యూల్‌ కులాల అభివృద్ధి అధికారి ఉమాపతి మాట్లాడుతూ జిల్లాలోని రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించినట్లు తెలిపారు. కులాంతర వివాహాల కింద 8 జంటలకు రూ.2.50 లక్షల చొప్పున ప్రొత్సాహాన్ని అందిచామన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్‌ యువ వికాసం పథకం కింద ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ కోట ప్రకారం మంజూరు చేయాలని కమిషన్‌ చైర్మన్‌ పేర్కొన్నారు. డీఎస్పీ లింగయ్య మాట్లాడుతూ ఈ ఏడాది ఇప్పటి వరకు 9 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు కాగా వాటిలో 3 ట్రయల్‌లో ఉన్నాయని మిగతా 6 విచారణ కొనసాగుతుందని వాటికి గాను రూ.2 లక్షల నష్టపరిహరం చెల్లించడం జరిగిందని డీఎస్పీ వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ కేసులలో నింధితులకు శిక్ష పడేలా బలమైన సాక్ష్యాలను ప్రవేశ పెట్టాలని శిక్ష పడకపోతే సంబంధిత అధికారుల శ్రమ అంతా వృథా అవుతుందని కమిషన్‌ చైర్మన్‌ చెప్పారు. డీఏఓ జాన్‌ సుధాకర్‌ మాట్లాడుతూ రైతుబీమా, రైతు భరోసా, రైతు రుణమాఫీ కింద ఎంతమందికి లబ్ధి చూకూరిన విషయాలు వివరించారు. ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారానికి పోలీసు శాఖ పరంగా అన్ని చర్యలు తీసుకుంటామని, కమిషన్‌ చైర్మన్‌ సూచించిన సలహాలు,సూచనలను తప్పక పాటిస్తామని తెలిపారు. అనంతరం బాధితుల సమస్యలపై చైర్మన్‌ వినతు లు స్వీకరించారు. కమిటి సభ్యులు కొంకటి లక్ష్మినారాయణ, నీలాదేవి, రాంబాబునాయక్‌, రేణికుంట్ల ప్రవీణ్‌, ఆర్డీఓ రాంచంద్రనాయక్‌, జడ్పీసీఈఓ శైలేష్‌ కుమార్‌, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ జయచంద్రమోహన్‌, డీఆర్‌డీఏ మొగులప్ప, డీటీడబ్ల్యూఓ జనార్ధన్‌ పాల్గొన్నారు.

ప్రతి నెల చివరి వారంలో పౌరహక్కుల దినోత్సవం నిర్వహించాలి

ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement