
తొలిరోజు హాజరు అంతంతే..
నారాయణపేట రూరల్: వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు గురువారం పునఃప్రారంభమయ్యాయి. పలు ప్రభుత్వ పాఠశాలల్లో మామిడి తోరణాలు కట్టి పూజలు చేసి తరగుతులు ప్రారంభించారు. ప్రైవేటు పాఠశాలల్లో రంగులు వేశారు. ఇక గురువారం జిల్లాలోని పాఠశాలల దగ్గర పెద్దగా విద్యార్థుల సందడి కనిపించలేదు. తొలిరోజు జిల్లాలో 57,281 మందికి గాను 18,313మంది విద్యార్థులు పాఠశాలలకు రాగా, కేవలం 31.9శాతం మాత్రమే హాజరు నమోదైంది.
పాఠ్యపుస్తకాలు, యూనిఫాంల పంపిణీ
అయితే పాఠశాలలకు హాజరైన విద్యార్థులకుగాను తొలిరోజు 1,90,885 పాఠ్యపుస్తకాలు, 3,84,000నోటుపుస్తకాలు, 18,313యూనిఫాం పంపిణీ చేపట్టరు. వీరిలో 10,303 మంది బాలికలు, 8,010మంది బాలురు ఉన్నారు. జిల్లాలో చాలా పాఠశాలల్లో విద్యార్థులను వినూత్న పద్ధతిలో పాఠశాలలోకి ఆహ్వానించారు. కొత్తగా చేరిన వారికి పువ్వులు అందించారు. మరి కొన్ని చోట్ల సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేసి పిల్లల ఫొటోలు దింపి వారి తల్లిదండ్రులకు వాట్సాఫ్లలో పంపించారు. మొత్తానికి మొదటిరోజు ఆట, పాటలతో చిన్నారులను ఉత్తేజ పరిచారు. ఇదిలాఉండగా, ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు 2025–26 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు గురువారం బడిబాట పట్టారు. అయితే చాలా పాఠశాలలు ఉపాధ్యాయుల హాజరుకే పరిమితం అయ్యాయి. మరికొన్ని చోట్ల విద్యార్థుల హాజరు నామమాత్రంగా ఉండటం గమనార్హం. పట్టణాలతో పోల్చితే గ్రామీణ ప్రాంతాలలోని ప్రభుత్వ పాఠశాలలో మొదటి రోజు విద్యార్థుల హాజరు శాతం చాలా తక్కువగానే ఉంది. అయితే, బుధవారం ఏరువాక పౌర్ణమి పండగ కావడంతో కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపేందుకు అంతగా ఆసక్తి చూపలేదు. దీంతో తొలిరోజు విద్యా సంస్థలు వెలవెలబోయాయి. వచ్చిన విద్యార్థులకు ఉపాధ్యాయులు.. మధ్యాహ్న భోజనం పెట్టించి తరువాత పంపించారు. ముఖ్యంగా వసతి గృహాలు మూసివేత ప్రభావం పాఠశాలల హాజరు శాతంపై స్పష్టంగా కనిపించింది. కొన్ని తరగతులలో మాత్రం ఒకరు, ఇద్దరూ మాత్రమే హాజరుకావడం కనిపించింది. తెరిచిన కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలలో సైతం పలుచుగానే హాజరు నమోదైంది.
తెరుచుకున్న పాఠశాలలు
మొదటిరోజు 32శాతం
విద్యార్థుల హాజరు

తొలిరోజు హాజరు అంతంతే..

తొలిరోజు హాజరు అంతంతే..