
విత్తన భారం
● పెరిగిన విత్తనాల ధరలు
● పాకెట్ పత్తిపై రూ.వంద పెంపు
● అదే దారిలో మిరప, కంది, అముదం, వరి ధరలు
● పెట్టుబడి భారమవుతుందని రైతుల ఆందోళన
● జిల్లాలో 1.80 లక్షల ఎకరాల్లో పత్తి సాగు
మరికల్: వానాకాలం సీజన్లో వివిధ రకాల విత్తనాల ధరలను కంపెనీలు పెంచడంతో రైతులపై అధిక పెట్టుబడుల భారం పడుతుంది. సాధారణ పత్తి సాగుకు అవసరమయ్యే సర్టిపైడ్ విత్తనాల ప్యాకెట్ ధరలు పెరగడం రైతులు ఆందోళన కలిగిస్తుంది. కేజీ పత్తి పాకెట్ ధర రూ.910కి పెరిగింది. గతేడాది పోల్చితే రూ.60 వరకు పెరిగింది. జిల్లాలో రైతులపై రూ.కోట్లలో భారం పడనుంది. గతంలో పోల్చితే ఎరువులు, మందులు, కూలీల ధరలు పెరగటంతో పెట్టుబడి పెరిగిందని, ఇప్పుడు పత్తి, మిరప, కంది, అముదం, వరి విత్తనాల ధరలు కూడా పెరగడంతో మూలిగేనక్కపై తాడిపండు పడ్డ చందంగా విత్తన ధరలు పెరగటం మరింత భారం కానుందని వాపోతున్నారు.
ప్రైవేటుగా కొనుగోలు
సాధారణ పత్తి సాగుకు విత్తనాల సరఫరాను ప్రభుత్వం ఎప్పుడో నిలిపి వేసింది. రైతులంతా ప్రైవేటు డీలర్ల వద్ద కొనుగోలు చేస్తున్నారు. పలు కంపెనీలు వివిధ రకాల విత్తనాలను మార్కెట్లో ప్రవేశ పెట్టడంతో విత్తన ధరలపై కేంద్ర ప్రభుత్వం నియంత్రణ విధించింది. యేటా విత్తన తయారీ తదితర ఖర్చులను లెక్కించి ప్రభుత్వం కంపెనీలకు విక్రయ ధర నిర్ణయిస్తోంది. ఆ మేరకు విత్తనాలు విక్రయించాల్సింటుంది. మార్కెట్లో బీటీ–1, బీటీ–2 రకాలు అందుబాటులో ఉన్నాయి. రైతులు బీటీ–2 సాగుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.
ధర పెంపుతో దిగాలు
జిల్లాలో 1.80 లక్షల ఎకరాల్లో ఈ ఏడాది పత్తి సాగు అవుతుంది. ఎకరాకు 3 ప్యాకెట్ల చొప్పున విత్తనాలు నాటాలి. ఒక పాకెట్ వెంబడి రూ.100 పెరగటంతో ఎకరాకు రూ.300 అదనంగా భారంగా అవుతుంది. ఇప్పటికే వందల రకాల పత్తి విత్తనాల కంపెనీలు వివిధ పేర్లతో డీలర్లకు అందించటం వారు రైతులకు విక్రయిస్తున్నారు. వీటికి తోడు కొందరు డీలర్లు నకిలీ విత్తనాలు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రతి ప్యాకెట్పై క్యూఆర్ కోడ్ నిబంధనను ప్రభుత్వం అమలు చేస్తోంది. అయినా రైతులు నాసీరకం విత్తనాలతో డీలర్ల చేతిలో మోసపోతూనే ఉన్నారు. ధర పెరగడం వల్ల రైతులపై అదనపు భారం పడింది.
ఇతర విత్తనాలు
మూడేళ్లుగా మిరపతో ఇతర విత్తనాల ధరలు కూడా పెరుగుతున్నాయి. ప్రభుత్వ పరంగా మిరప విత్తనోత్పత్తి లేకపోవటం పట్ల ప్రైవేట్ కంపెనీలు విక్రయించే విత్తనాలే వారికి దిక్కవుతున్నాయి. పది గ్రాముల విత్తనాలకు రూ. 1500 పలుకుతుంది. సాగును దృష్టిలో ఉంచుకొని వివిధ రాష్ట్రాలకు చెందిన విత్తన కంపెనీలు కొత్త కొత్త బ్రాండ్ల పేరుతో విక్రయిస్తున్నాయి. రైతులు ఎక్కువగా విత్తనాలు కొనుగోలుకు కర్నూల్ జిల్లా డీలర్లను ఆశ్రయిస్తుంటారు. అలాగే వరి, కంది, అముదం విత్తనాలు కూడా భారీగా పెరిగాయి.

విత్తన భారం

విత్తన భారం

విత్తన భారం