
వరదలపై అప్రమత్తంగా ఉండాలి
నారాయణపేట: వరదల సమాచారంపై ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సిక్తాపట్నాయక్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో వరద నివారణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై ఎస్పీ యోగేష్ గౌతమ్, అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్తో కలిసి ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని నదుల ప్రవాహం మొదటి దశ ఎంత, ప్రమాదస్థాయి ఎంత అని ఆరా తీస్తూ.. నదీ తీర గ్రామాల్లో 10, మాగనూర్ 4, కృష్ణా గ్రామాలు ఉన్నాయని వాటికి ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్ శాఖ వారి యాక్షన్ ప్లాన్ ఇవ్వాలని ఎస్ఈని కలెక్టర్ ఆదేశించారు. జీపీల దగ్గర వాటర్ ట్యాంకర్స్, బ్లీచింగ్ పౌడర్ వేయాలని అన్నారు. బోట్స్, ఫిషర్ మాన్ పంప్స్ లైవ్ జాకెట్స్, జెసీబీ, ట్రాక్టర్స్ ,ఎమర్జెన్సీ లైట్స్, వాకీ టాకీ అన్ని సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. పశుసంవర్ధకశాఖ వారు వరదలపై జంతువుల రక్షణ కొరకు చర్యలు తీసుకోవాలన్నారు. వైద్యశాఖ పరిధిలో ఆశా వర్కర్లు, సూపర్వైజర్లు అందరిని అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ప్రత్యేక వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేయాలన్నారు. ఎస్పీ యోగేష్ గౌతమ్ మాట్లాడుతూ వరదల్లో ఆహరం, తాగునీరు షెల్టర్ విద్యుత్ రవాణా వాహనాల సదుపాయం తదితర వాటిని ప్రమాద గ్రామాలైన 18 గ్రామ పంచాయతీల్లో అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. అధికారులు అందరు హెడ్ క్వార్టర్లో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో ఆర్డీఓ రాంచందర్, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
రెండు నెలల్లో హ్యాండ్లూమ్ ఎక్స్లెన్స్
భవన నిర్మాణం
హ్యాండ్లూమ్ ఎక్స్లెన్స్ సెంటర్ నిర్మాణ పనులు రెండు నెలల్లో ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాల్సిందేనని కలెక్టర్ ఆదేశించారు. బుధవారం ఆమె జిల్లా కేంద్రానికి సమీపంలో కొనసాగుతున్న హ్యాండ్లూమ్ ఎక్స్లెన్స్ సెంటర్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఆ సెంటర్లో చేనేత జౌళిశాఖ తరపున ఎలాంటి శిక్షణలు ఇస్తారని ఆరా తీశారు. ఆగస్టు వరకు నిర్మాణ పనులు పూర్తి చేసి సెంటర్ ప్రారంభానికి సిద్ధం చేయాలని సూచించారు. అనంతరం టీజీ ఎంఎస్ఐడిసి టెస్కో ఓఎస్డీ హైదరాబాద్, మహబూబ్నగర్ చేనేత జౌళిశాఖ ఏడితో సమీక్ష నిర్వహించారు. రెండు నెలల్లో భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు. టెస్కో ఔస్డి రతన్కుమార్, టిజిఎంఎస్ఐడిసి, ఈఈ రవీందర్, డీఈ కృష్ణమూర్తి పాల్గొన్నారు.
మంత్రి శ్రీహరిని కలిసిన కలెక్టర్
నారాయణపేట: మంత్రిగా నియమితులైన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిని కలెక్టర్ సిక్తా పట్నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం మంత్రి సృగృహంలో కలిసి పూలమొక్క అందజేశారు. జిల్లా అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుదామని మంత్రి కలెక్టర్కు సూచించారు.