
ప్రైవేట్ ఆస్పత్రులు నిబంధనలు పాటించాలి
నారాయణపేట: ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు నిబంధనలు తప్పక పాటించాలని, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం ఆస్పత్రి నిర్వహణ ఉండేలా చూసుకోవాలని డీఎంహెచ్ఓ జయచంద్రమోహన్, డిప్యూటీ డీఎంహెచ్ఓ శైలజ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కిడ్స్, అక్షిత, కరుణ, గీత ప్రైవేట్ ఆస్పత్రులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రి లోపల బయట పరిసరాల శుభ్రంగా ఉంచుకోవాలని, ప్రైస్ చార్టు, నేమ్ బోర్డు, బయో వేస్టేజ్ నిర్వహణ మొదలైనవి సరైన విధంగా ఉండాలని, ఎవరు అతిక్రమించిన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
రైల్వే స్టేషన్లో నేస్తం ఫిర్యాదు కార్యక్రమం
స్టేషన్ మహబూబ్నగర్: జిల్లాకేంద్రంలోని రైల్వే స్టేషన్లో బుధవారం నేస్తం ఫిర్యాదు పరిష్కార కార్యక్రమాన్ని చేపట్టారు. సీనియర్ డివిజనల్ పర్సనల్ ఆఫీసర్ ఆనంద్కట్టా, ఐఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. నేస్తం కార్యక్రమం ద్వారా ఉద్యోగులు వ్యక్తిగతంగా శాఖ అధికారులను కలిసి తమ సేవా సంబంధిత సమస్యలు, ఫిర్యాదులను నేరుగా తెలియజేసే అవకాశాన్ని పొందుతారని అధికారులు తెలిపారు. సమస్యను బట్టి వాటిని తక్షణం, వారం, 15 లేదా 30 రోజుల్లో పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. వేగవంతమైన సమస్యల పరిష్కారం, సానుకూలమైన పని వాతావరణం కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని అన్నారు.
26న జిల్లాస్థాయి స్పోర్ట్స్ స్కూల్ ఎంపికలు
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో ఈనెల 26వ తేదీన జిల్లాస్థాయి స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్స్ నిర్వహించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి ఎస్.శ్రీనివాస్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. స్పోర్ట్స్ స్కూళ్లలో 4 తరగతిలో ప్రవేశాల కోసం జిల్లాస్థాయి ఎంపికలు జరగనున్నాయని పేర్కొన్నారు. విద్యార్థులకు ఎత్తు, బరువు, ఫ్లెక్సిబిలిటీ టెస్ట్, వర్టికల్ జంప్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, మెడిసన్ బాల్త్రో, 30 మీటర్ల ఫ్లైయింగ్, 6x10 మీటర్ల షటిల్ రన్, 800 మీటర్ల రన్నింగ్ అంశాల్లో పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. 4వ తరగతిలో ప్రవేశాల కోసం 8–9 సంవత్సరాలు 01.09.2016 నుంచి 31.08.2017 మధ్య జన్మించిన వారు ఎంపికలకు అర్హులని తెలిపారు. జిల్లా స్థాయి ఎంపికలకు హాజరయ్యే విద్యార్థులు పాఠశాల, మున్సిపాలిటీ, ఎంఆర్ఓ జారీచేసిన జనన ధ్రువీకరణ పత్రం, 10 పాస్పోర్టు సైజ్ ఫొటోలు, 3వ తరగతి ప్రొగ్రెస్ రిపోర్ట్, కమ్యూనిటీ సర్టిఫికెట్, ప్రస్తుత స్టడీ సర్టిఫికెట్, ఆధార్కార్డుతో ఉదయం 8 గంటలకు రిపోర్టు చేయాలని కోరారు. పైన పేర్కొన్న ధ్రువపత్రాల్లో ఏది లేకున్నా ఎంపికలకు అనుమతించమని తెలిపారు. రాష్ట్రస్థాయి ఎంపికలు జూలైలో ఉంటాయని, మిగతా వివరాల కోసం 94406 56162 నంబర్ను సంప్రదించాలని ఆయన సూచించారు.
మొక్కజొన్న క్వింటాల్ రూ.2,264
జడ్చర్ల: బాదేపల్లి మార్కెట్కు బుధవారం మొక్కజొన్నకు గరిష్టంగా రూ.2,264, కనిష్టంగా రూ.1,369 ధరలు లభించాయి. అదేవిధంగా ఆముదాలు రూ.6,318, రాగులు రూ.2,310, జొన్నలు రూ.3,067, వేరుశనగ రూ.3,251 ధర పలికాయి.