
నిఘా నీడలో మార్కెట్!
నారాయణపేట: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డులో వ్యవసాయ ఉత్పత్తుల క్రయ, విక్రయాలు నిఘా నీడలో కొనసాగుతున్నాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎక్కడా లేని విధంగా పేట మార్కెట్ యార్డులో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. రూ. 9.92 లక్షల వ్యయంతో ఏర్పాటుచేసిన 30 సీసీ కెమెరాలను ఇటీవల స్థానిక ఎమ్మెల్యే డా.చిట్టెం పర్ణికారెడ్డి చేతులమీదుగా ప్రారంభించారు. యార్డులో విక్రయానికి వచ్చే ధాన్యం చోరీకి గురికాకుండా.. కొనుగోళ్ల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టేందుకు సీసీ నిఘా దోహద పడనుంది.
చోరీలు, జీరో దందాకు కళ్లెం..
వానాకాలం, యాసంగి సీజన్ల్లో రైతులు పండించిన పంటలను విక్రయించేందుకు మార్కెట్యార్డుకు పెద్దఎత్తున వస్తారు. ఈ సమయంలో ధాన్యం బస్తాలు చోరీకి గురైన సంఘటనలు అనేకం ఉన్నాయి. అయితే సీసీ కెమెరాల ఏర్పాటుతో ధాన్యం బస్తాల చోరీకి అడ్డుకట్ట పడినట్లు అయ్యింది. మరోవైపు వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు చేతివాటానికి, జీరో దాందాలకు కళ్లెం పడుతుందని వ్యాపార పరిశీలకులు భావిస్తున్నారు.
చెక్పోస్టుల్లో నిఘా కరువు..
నారాయణపేట మార్కెట్యార్డు పరిధిలోని జలాల్పూర్, మరికల్లో ఉన్న చెక్పోస్టులపై నిఘా లేకుండా పోయింది. వ్యవసాయ ఉత్పత్తుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ఏర్పాటుచేసిన చెక్పోస్టుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయకపోవడంపై పలువురు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. నూతన టెక్నాలజీతో సీసీ కెమెరాలను మార్కెట్యార్డులో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూంకు అనుసంధానం చేసుకోవచ్చని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. కానీ మార్కెట్ అధికారులు,పాలకులు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని పేర్కొంటున్నారు.
అక్రమార్కుల్లో దడ..
గతంలో మార్కెట్ యార్డుకు రైతులు ఎంత మేర ధాన్యం తీసుకొస్తున్నారు.. ఎప్పుడు ఏ లారీ వెళ్తుందో ఎవరికీ తెలియని పరిస్థితి ఉండేది. ప్రస్తుతం సీసీ కెమెరాల ఏర్పాటుతో ఏ దుకాణం నుంచి ఏ లారీ లోడింగ్ చేసుకొని బయటికి వెళ్తుంది.. ఏ మూలన ఏం జరిగినా సీసీ కెమెరాల్లో రికార్డు అవుతుంది. ఏ కమీషన్ ఏజెంట్ వద్ద ఎంత లోడ్ ఉందో కనిపిస్తుంది. అయితే రైతులను మోసం చేసేందుకు ప్రయత్నించే అక్రమార్కులకు మాత్రం భయం పట్టుకుంది. ఉమ్మడి జిల్లాలో ఎక్కడా లేని విధంగా నారాయణపేట మార్కెట్యార్డులో సీసీ కెమెరాల ఏర్పాటుతో వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు, దళారుల్లో దడ పుట్టిందని చెప్పవచ్చు.
రూ. లక్షల్లో ఆదాయం..
జిల్లాలోని నారాయణపేట, మక్తల్, కోస్గి పట్టణాల్లో వ్యవసాయ మార్కెట్ యార్డులు ఉన్నాయి. నారాయణపేట మార్కెట్యార్డులో తొలిసారిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడాన్ని అందరూ స్వాగతిస్తున్నప్పటికీ.. మిగతా మార్కెట్యార్డులను వదిలేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇలాఖాలోని కోస్గి మార్కెట్ యార్డులో క్రయవిక్రయాలు అంతంతగానే కొనసాగుతాయి. కానీ చెక్పోస్టు ద్వారా ఆ మార్కెట్ యార్డుకు రూ. లక్షల్లో ఆదాయం సమకూరుతోంది. అయితే ఈ మార్కెట్యార్డులో సీసీ నిఘా లేకపోవడంలో ఆంతర్యమేమిటనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అదే విధంగా మక్తల్ మార్కెట్ యార్డులో క్రయవిక్రయాలు అంతంతమాత్రం అయినప్పటికీ.. మార్కెట్ పరిధిలోని రాష్ట్ర సరిహద్దు టైరోడ్డు వద్ద చెక్పోస్టు ఏర్పాటు చేశారు. అక్కడ సీసీ నిఘా లేకపోవడంతో ఏం జరుగుతుందో తెలియని దుస్థితి నెలకొంది. జిల్లాలోని అన్ని మార్కెట్యార్డులు, చెక్పోస్టుల్లో వైర్లెస్ సీసీ కెమెరాలను ఏర్పాటుచేసి.. జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని ఆర్థిక నిపుణులు, వ్యాపార వేత్తలు కోరుతున్నారు.
పేట మార్కెట్యార్డులో 30 సీసీ కెమెరాల ఏర్పాటు
ఉమ్మడి జిల్లాలోనే తొలిసారిగా..
పారదర్శకంగా వ్యవసాయ ఉత్పత్తుల క్రయ, విక్రయాలు
ధాన్యం బస్తాల చోరీకి అడ్డుకట్ట

నిఘా నీడలో మార్కెట్!