పేదల కళ్లల్లో ఆనందం నింపడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

పేదల కళ్లల్లో ఆనందం నింపడమే లక్ష్యం

Jun 11 2025 11:44 AM | Updated on Jun 11 2025 11:44 AM

పేదల కళ్లల్లో ఆనందం నింపడమే లక్ష్యం

పేదల కళ్లల్లో ఆనందం నింపడమే లక్ష్యం

మరికల్‌: పేదల కళ్లల్లో ఆనందం నింపడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. మరికల్‌లో మంగళవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో 110 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్‌ అందజేశారు. అనంతరం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకం లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి నిరుపేద సొంతింటి కలను సాకారం చేస్తామన్నారు. ప్రభుత్వం అందించే ఆర్థికసాయంతో లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లను త్వరగా నిర్మించుకోవాలని.. తాను గృహప్రవేశం కార్యక్రమానికి వస్తానని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్యన్‌ సదాశివారెడ్డి, సింగిల్‌విండో చైర్మన్‌ వెంకట్రామారెడ్డి, తహసీల్దార్‌ రాంకోటి, ఎంపీడీఓ కొండన్న, నాయకులు సూర్యమోహన్‌రెడ్డి, వీరన్న, తిమ్మారెడ్డి, కృష్ణయ్య, రఘు, కుర్మన్న, రామకృష్ణ, రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

నారాయణపేట: తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరం 4వ తరగతిలో ప్రవేశానికి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా క్రీడాశాఖ అధికారి వెంకటేశ్‌ శెట్టి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. హకీంపేట్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించేందుకు ఈ నెల 7వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమైందని పేర్కొన్నారు. అర్హత, ఆసక్తిగల విద్యార్థులు 15వ తేదీలోగా www.tgss.telangana. gov.in వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 94904 09900 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.

రాజీమార్గమే ఉత్తమం

నారాయణపేట: చిన్నచిన్న కేసుల పరిష్కారానికి రాజీమార్గమే ఉత్తమమని ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వివాదాలను పెంచుకుంటే జీవితకాలం కొనసాగుతాయని.. ఇరువర్గాలు కలిసి ఒక నిర్ణయానికి వస్తే వెంటనే సమసిపోతాయన్నారు. రాజీ అయ్యే కేసుల పరిష్కారం కోసం ఈ నెల 14న న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే జాతీయ లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని కక్షిదారులకు సూచించారు.

పీజీ మూడో సెమిస్టర్‌ ఫలితాలు విడుదల

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పాలమూరు యూనివర్సిటీ పరిధిలో పీజీ 3వ సెమిస్టర్‌, ఎంసీఏ, ఎంబీఏ పరీక్ష ఫలితాలను పీయూ వీసీ ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌ మంగళవారం విడుదల చేశారు. మొత్తం 84.83శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ డాక్టర్‌ కె.ప్రవీణ పేర్కొన్నారు. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవాలని, ఏమైనా సందేహాలుంటే త్వరలో రీకౌంటింగ్‌కు నోటిఫికేషన్‌ జారీ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ చంద్రకిరణ్‌, కోఆర్డినేటర్‌ డాక్టర్‌ అరుంధతి, డాక్టర్‌ రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.

రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే

సాక్షి, నాగర్‌కర్నూల్‌: రానున్న రోజుల్లో రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పాలన చూశామని, వీరి పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని చెప్పారు. విశ్వగురువుగా మోదీ పాలన ప్రపంచవ్యాప్తం అయిందని, రాష్ట్రంలోనూ బీజేపీ పాలనతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాకేంద్రంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. 11 ఏళ్ల మోదీ పాలనలో చేసిన పనులను ప్రజలకు కులంకశంగా వివరించనున్నట్టు తెలిపారు. మోదీ పాలనలో దేశంలోని 21 కోట్ల ప్రజలను పేదరికం నుంచి విముక్తి కల్పించినట్టు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రపంచ బ్యాంకు నివేదికలోనే స్పష్టం చేసిందన్నారు. 11 ఏళ్ల కిందట ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో పదో స్థానంలో ఉన్న భారత్‌ నేడు నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని చెప్పారు. మేక్‌ ఇన్‌ ఇండియా విధానంతో 95 శాతం ఆర్మీ సామగ్రి దేశంలోనే తయారవుతోందని వివరించారు. పహల్గాంలో దాడి చేసిన ఉగ్రమూకలకు సరైన సమయంలో భారత్‌ గట్టి గుణపాఠం చెప్పిందన్నారు. గత ఏడాదిన్నర పాలనలో సీఎం రేవంత్‌రెడ్డి తన సొంత జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల్లో తట్టెడు మట్టి కూడా తీయలేదని విమర్శించారు. మాజీ మంత్రి రాములు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దిలీపాచారి, ఆచారి, భరత్‌ప్రసాద్‌, ప్రమోద్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement