
బడిబాట.. విద్యకు ప్రగతిబాట
నర్వ: జిల్లాలో సర్కారు బడుల్లో ప్రవేశాలు పెంచడమే లక్ష్యంగా ఈ నెల 6 నుంచి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని విద్యాశాఖ ప్రారంభించింది. ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమం చొప్పున ఈ నెల 19 వరకు నిర్వహించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచడం.. పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలు.. పూర్తి వివరాలపై విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించడే కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. ఈమేరకు షెడ్యూల్ను డీఈఓ గోవిందరాజులు ఇదివరకే విడుదల చేశారు. కలెక్టర్ సిక్తాపట్నాయక్ నేతృత్వంలో సమావేశాలు నిర్వహించారు. వినూత్నంగా ఉపాధ్యాయులు గ్రామాల్లో పాఠశాలల విద్యాప్రగతితో కూడిన కరపత్రాలను ముద్రించి ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహిస్తున్నారు.
మండలాల స్థాయిలో..
మండల పరిషత్ అధికారులు, ఎస్ఐలు, ఇతర వర్గాల ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేస్తారు. ఏ రోజు ఏం చేయాలనే కార్యచరణను ఎంఈఓ రూపొందిస్తారు. గ్రామ స్థాయిలో కమిటీలు, బడిబాటపై అవగాహన, ప్రచార కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నిర్వహిస్తారు. స్థానిక నేతల భాగస్వామ్యంతో బడిబాటలో గుర్తించిన విద్యార్థుల ప్రవేశాల ప్రక్రియ చేపడుతారు.
బడిబాట లక్ష్యాలు..
● అన్ని గ్రామాల్లోని ఆవాస ప్రాంతంలో బడిఈడు పిల్లలను గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం
● ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ పెంచుట, నాణ్యమైన విద్యను అందించడం
● అంగన్వాడీ కేంద్రాల్లో 5 ఏళ్లు దాటిన పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించడం
● గ్రామ విద్య రిజిష్టర్ను అప్డేట్ చేయడం
● తక్కువ విద్యార్థులున్న పాఠశాలలో విద్యార్థుల నమోదు పెంచడం
● బాలికా విద్య ప్రాధాన్యతను తెలియజేస్తు వారిని పాఠశాలలో చేర్పించడం
● బడిబాటలో గ్రామాల్లోని పాఠశాలల పరిధిలోని ప్రజాప్రతినిధులను కార్యక్రమంలో పాల్గొనే విధంగా చూడడం
● ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు ఈ కార్యక్రమంలో ర్యాలీలు నిర్వహించి అవగాహన కల్పించడం.
● ప్రత్యేక అవసరాలుగల పిల్లలను గుర్తించి నమోదు చేయడంంతో పాటు పాఠశాలల్లో చేర్పించడం.
షెడ్యూల్..
● మొదటి రోజైన జూన్ 6న ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులతో గ్రామసభ, రెండో రోజు 7న ఉపాధ్యాయులు విద్యార్థుల ఇంటింటి సందర్శించి బడీడు పిల్లలను గుర్తించారు.
● 3, 4, 5 రోజులు: 8, 9, 10 తేదీన కరపత్రాలతో ఇంటింటి ప్రచారం, అంగన్వాడీ కేంద్రాల సందర్శన, బడిమానేసిన పిల్లలను గుర్తించి చేర్పించడం, ప్రత్యేక అవసరాల పిల్లలను భవితా కేంద్రాల్లో చేర్పించడం.
● 11వ తేదీన నిర్వహించిన కార్యక్రమాలపై సమీక్ష
● 12వ తేదీన అమ్మ ఆదర్శ కమిటీల ఆద్వర్యంలో చేపట్టిన పనులను ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించడం పిల్లలకు పాఠ్య, రాతపుస్తకాల పంపిణీ, ఉచిత యూనిఫామ్స్ అందజేత
● 13న సామూహిక అక్షరాభ్యాసం, బాలసభ
● 16న తొలిమెట్టు, ఉన్నతి కార్యక్రమాల దినోత్సవం, తరగతి గదుల్లో విషయాల వారీగా అభ్యాసన సామర్థ్యాల వాల్పోస్టర్ల ప్రదర్శన, పిల్లలు రూపొందించిన చార్టులతో గదుల అలంకరణ, చదవడం, గణిత సంబంధిత వాటిపై క్విజ్పోటీలు
● 17న సమీకృత విద్య, బాలిక విద్యాదినోత్సవం నిర్వహణ, బాలికా వివాహాలు, చిన్నారులపై వేధింపులను అరికట్టేందుకు ప్రతిజ్ఞ
● 18న తల్లిదండ్రులు, పోషకులు, గ్రామస్తులు, వార్డుసభ్యులను ఆహ్వానించి తరగతి గదుల్లో చేపట్టిన డిజిటలీకరణ, సౌకర్యాలు చూపించడం, మొక్కల పెంపక ప్రాధాన్యాన్ని పిల్లలకు వివరించడం.
● 19న బడిబాట ముగింపు సందర్భంగా పిల్లలకు క్విజ్పోటీలు.
జిల్లా వివరాలిలా..
అన్నిశాఖల సమన్వయంతో..
కలెక్టర్ ఆధ్వర్యంలో అన్నిశాఖలు, అన్ని వర్గాల ప్రజల సమన్వయంతో బడిబాటను ప్రగతిబాటపట్టిస్తాం. పాఠశాల విద్యాశాఖ అందించిన గైడ్లైన్స్ ప్రకారం కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. దీంతో పాటు పీఎంశ్రీ, మన ఊరు మనబడి, దాతల సహకారంతో ప్రత్యేకంగా పాఠశాలల్లో సమకూరిన సౌకర్యాలను, విద్యార్థులు సాదించిన విజయాలను కరపత్రాల ద్వారా తెలియజేస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నాం.
– గోవిందరాజులు, డీఈఓ
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు
పెంచడమే లక్ష్యం
6 నుంచి 19 వరకు ప్రత్యేక
కార్యక్రమాలు..
డ్రాపౌట్స్ తగ్గింపే లక్ష్యంగా ముందుకు
జిల్లా యంత్రాంగం సన్నద్ధం
కలెక్టర్ నేతృత్వంలో డీఈఓ, ఎంఈఓ, ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో జిల్లా స్థాయిలో కార్యాచరణ రూపొదించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతంపై కెపాసిటీ బిల్డింగ్పేరిట జిల్లాలోని వివిధ కేటగిరిల ఉపాధ్యాయులకు ఇటీవల మూడు దఫాలుగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. పాఠశాలల ప్రారంభం లోపు ఉచిత దుస్తువులు, పుస్తకాలు, నోట్బుక్స్ అందించడంతో పాటు విద్యార్థుల నమోదును పెంచేందుకు కలెక్టర్ క్షేత్రస్థాయిలో దిశానిర్దేశం చేశారు. సామాజిక సేవాసంస్థలు, ఎన్జీవోలు, తదితర వర్గాలను సమన్వయపర్చి బడిబాటను ముందుకు తీపుకెళ్లాలని తెలిపారు.

బడిబాట.. విద్యకు ప్రగతిబాట