
మత్తు పదార్థాలపై ప్రత్యేక నిఘా
నారాయణపేట: కల్తీకల్లుకు వినియోగించే అల్ఫాజోలం, మరేదైనా మత్తు పదార్థాలు దొరికితే అవి ఎక్కచి నుంచి సరఫరా అవుతుందో నిఘా పెట్టాలని, కల్లు కంపౌండ్లను తరచుగా తనిఖీ చేయాలని ఆర్డీఓ రాంచందర్ నాయక్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో మాదకద్రవ్యాల నిషేధంపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో మాదకద్రావ్యాల నిషేధాన్ని పగడ్బందీగా అమలు చేసి డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చాలని, గంజాయి సాగు జరగకుండా వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. డీఎస్పీ లింగయ్య మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా పోలీసుశాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిషేధంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, గతంతో పోలిస్తే డ్రగ్స్ కేసులు చాలావరకు తగ్గాయని వివరించారు. టాస్క్ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు డ్రగ్స్పై నిఘా పెట్టారని అన్నారు. అయితే, కేవలం పోలీసు శాఖ మాత్రమే కాకుండా అబ్కారీ శాఖ అధికారలు మాదక ద్రవ్యాల నిషేధంపై కార్యక్రమాలు నిర్వహించాలని ఆర్డీఓ సూచించారు. ఇకపై జరిగే యాంటీ నార్కోటిక్ సమావేశాలకు ఆయా శాఖల ఆధ్వర్యంలో డ్రగ్స్ నిషేధంపై నిర్వహించిన కార్యక్రమాల నివేదికను తయారు చేసి తీసుకురావాలని ఆదేశించారు. వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసి డ్రగ్స్ నిషేధానికి శాఖల వారిగా తీసుకున్న చర్యలను గ్రూప్లో షేర్ చేయాలని సూచించారు. అనంతరం డ్రగ్స్ నిషేదం పై అవగాహన కల్పించేందుకు ముద్రించిన వాల్పోస్టర్ను అధికారులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆర్టీఓ మేఘా గాంధీ, డ్రగ్ ఇన్స్పెక్టర్ వినయ్కుమార్, వైద్య ఆరోగ్య శాఖ అధికారి బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.