
పాఠశాలల పునఃప్రారంభానికి సిద్ధం చేయాలి
నారాయణపేట రూరల్: పాఠశాలలు పున: ప్రారంభం నాటికి అన్ని వసతి సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. శనివారం తన ఛాంబర్ లో విద్యాశాఖ అధికారులతో వివిధ అంశాలపై సమీక్షించారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం వరకు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫాంలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అలాగే బడిబాటపై ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో దృష్టి సారించి విద్యార్థుల సంఖ్యను పెంచాలన్నారు. టీచర్లకు ఇచ్చిన శిక్షణను పాఠశాలల్లో అమలు చేసి పిల్లల విద్యాభివృద్ధికి కృషి చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. పాఠశాలల ప్రారంభం నాటికి పెండింగ్ లో ఉన్న పనులు కాంట్రాక్టర్లతో మాట్లాడి పూర్తి చేయించాలని, మధ్యాహ్న భోజన విషయంలో రాజీ లేకుండా నాణ్యతతో వడ్డించే విధంగా ముందస్తుగా చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాల కారణంగా ఇబ్బందులు ఉన్న పాఠశాలను గుర్తించాలని, నదీ ప్రవాహక ప్రాంతాల్లో ఉన్న బడులకు వరద ముప్పు ఉంటే అప్పటికప్పుడే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యార్థుల రాకపోకలకు సంబంధించి రవాణా పరమైన సమస్యలు తలెత్తకుండా ఆర్టీసీ అధికారులతో మాట్లాడాలన్నారు. పాఠశాలలలో టీచర్ల కొరత ఉంటే వర్క్ అడ్జస్ట్మెంట్ చేయాలని, ఉపాధ్యాయులంతా సమయపాలన పాటించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎంఈఓ లు, కాంప్లెక్స్ హెడ్మాస్టర్లు, సిఆర్పిలు నిరంతరం పాఠశాలల పర్యవేక్షణ చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. ఇతర విద్య కార్యక్రమాలపై ఆమె విద్యాశాఖ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. సమావేశంలో డీఈవో గోవిందరాజులు, జి సి డి ఓ నర్మదా, సంబంధిత అధికారులు యాదయ్య శెట్టి, రాజేంద్ర కుమార్ పాల్గొన్నారు.