
ప్రగతి పరుగులు
విద్య, వైద్య రంగాల్లో జిల్లా ముందడుగు
● అభివృద్ధి.. సంక్షేమానికి పెద్దపీట
● జిల్లాల పునర్విభజనతో పాలన చేరువ
● పెరిగిన పంటల సాగు విస్తీర్ణం
● సీఎం సొంత జిల్లా కావడంతో శరవేగంగా అభివృద్ధి
విద్యా రంగంలో విప్లవాత్మక మార్పు
2014 నుంచి ఇప్పటి వరకు విద్యారంగంలో జిల్లా వ్యాప్తంగా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేశారు. కేజీబీవీల్లో ఎస్ఎస్సీ నుంచి ఇంటర్మీడియట్కు అప్గ్రేడ్ చేసి అన్ని రకాల వసతులు కల్పించారు. మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా జిల్లాలో అభివృద్ధి పనులు చేపట్టారు. మెడికల్ కళాశాల, అగ్రికల్చర్ పాలిటెక్నికల్ కళాశాల, నూతన ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ఏర్పాటు చేయడం జరిగింది. నూతన కలెక్టరేట్ భవనానికి గత ప్రభుత్వంలోని అప్పటి మంత్రి కేటీఆర్తో శంకుస్థాపన చేశారు. ఇప్పటికి పనులు కొనసాగుతునే ఉన్నాయి.
నారాయణపేట: కొట్లాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లా ప్రగతిలో పరుగులు పెడుతోంది. ముఖ్యమైన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలతో పాటు మిగతా రంగాల్లో అభివృద్ధి అడుగులు వేస్తోంది. ఒకప్పుడు వలసలు, కరువుకు కేరాఫ్గా నిలిచిన నారాయణపేట జిల్లాలో ప్రధానంగా నీటిపారుదల, సాగు రంగంలో 11 ఏళ్లుగా మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వాలు సంక్షేమంతో పాటు అభివృద్ధికి పెద్దపీట వేయడం, రహదారులు విస్తరణతో అనతికాలంలోనే జిల్లా దశ మారింది. జిల్లాల పునర్విభజనలతో పట్టణాల్లో, పల్లెల్లో మౌలిక వసతుల కల్పనతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యా యి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 11 ఏళ్లు అవుతున్న సందర్భంగా జిల్లాలో చోటుచేసుకున్న పరిణమాలు, మారిన ముఖ చిత్రంపై ‘సాక్షి’ కథనం.
11 మండలాలు.. మూడు పురపాలికలతో జిల్లా ఏర్పాటు
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 2016 అక్టోబర్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పది ఉమ్మడి జిల్లాలను 31 జిల్లాలుగా మార్చారు. కాగా 2018 ఎన్నికల్లో నారాయణపేటకు ప్రచారం నిమిత్తం వచ్చిన కేసీఆర్ ఎమ్మెల్యేగా ఎస్.రాజేందర్రెడ్డిని గెలిపిస్తే జిల్లాను ఇస్తానని చెప్పిన మాటతో 2019 ఫిబ్రవరి 17న నూతన జిల్లాగా నారాయణపేట ఆవిర్భవించింది. 11 మండలాలు, మూడు మున్సిపాలిటీలతో ఆవిర్భవించిన జిల్లా గత ప్రభుత్వ హయంలోనే 13 మండలాలుగా ఏర్పడింది. ప్రభుత్వం మారిన తర్వాత సీఎం రేవంత్రెడ్డి మరో మున్సిపాలిటీ మద్దూర్ను ప్రకటింపజేయడంతో నాలుగు మున్సిపాలిటీలుగా మారాయి.
పెరిగిన సాగు విస్తీర్ణం
ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం, జిల్లా ఏర్పాటు తర్వాత పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. 2014కు ముందు జిల్లా వ్యాప్తంగా అన్ని పంటలు కలిపి 3.50 లక్షల ఎకరాల్లో సాగు కాగా ప్రస్తుతం 4.30 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. ప్రధానంగా పత్తి, వరి వైపే రైతులు ఆసక్తి చూపుతున్నారు. జూరాల బ్యాక్ వాటర్ ద్వారా భూత్పూర్, సంగంబండ రిజార్వాయర్లకు నీటిని నింపడంతో దాదాపు 50 వేల ఎకరాలకు సాగు నీరందుతుంది. 2014 నుంచి 2018 వరకు విడత వారిగా జిల్లాలో దాదాపు వెయ్యి చెరువులను మిషన్ కాకతీయ పథకంలో పునరుద్ధరించడంతో భూగర్భజలాలు పెరిగాయి. రాష్ట్ర అవతరణకు ముందు రైతులను ప్రభుత్వం అంతగా పట్టించుకునేది కాదు. బీఆర్ఎస్ పాలనలో 2018లో రైతుబందు పథకం రావడంతో వ్యవసాయ రంగానికి మారింత అండగా నిలిచింది. రైతు రుణమాఫీ సమీకృత మార్కెట్లు, గోదాంల సామర్థ్యం పెంపు, ప్రభుత్వమే మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేసుయడం వంటి అంశాలు సాగు రంగానికి దోహదం చేశాయి. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో కొడంగల్ మక్తల్ నారాయణపేట పథకానికి పెద్దపీట వేయడంతో అయా నియోజవర్గాలో లక్ష ఎకరాలకు సాగుపెరిగే అవకాశం ఉంది.

ప్రగతి పరుగులు