
బెస్ట్ అవైలబుల్ స్కూల్లో ప్రవేశానికి దరఖాస్తులు
నారాయణపేట రూరల్: జిల్లాలోని ఎస్సీ కులాలకు చెందిన విద్యార్థిని, విద్యార్థులు బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో అడ్మిషన్ కొరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధిఖారి ఉమాపతి ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత గల ఎస్సీ కులాలకు చెందిన విద్యార్థులు 1వ తరగతి, 5వ తరగతి బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో 2025 – 2026 విద్యా సంవత్సరంలో చదువుకునేందుకు ఉచిత అడ్మిషన్ కొరకు ఈ నెల 16 నుంచి 19 వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఉంటుందన్నారు. దరఖాస్తుదారు కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.50 లక్షలు, పట్టణవాసులకు రూ. 2 లక్షలు మించకుండా ఉండాలని, కులం, ఆదాయం, రెసిడెన్సియల్ ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు డీఎస్సీడీఓ కార్యాలయంలోగానీ, 9492957258 నెంబర్ లో సంప్రదించాలని ఆయన తెలిపారు.
జర్నలిస్టు పిల్లలకు
ఉచిత విద్య
నారాయణపేట రూరల్: జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ఉచిత విద్యను అందించాలని డీఈఓ గోవిందరాజులు సూచించారు. టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షులు కే.నారాయణరెడ్డి, విద్యాశాఖ కన్వీనర్ ఆకుల రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం డీఈఓకు వినతి పత్రం అందించారు. ఈ మేరకు ఆయన వెంటనే స్పందించి 2025 –26 విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని అక్రిడేషన్ కార్డు కలిగిన జర్నలిస్టు పిల్లలలో ఒకరికి ఉచిత విద్య, మరొకరికి 50 శాతం రాయితీతో చదివించాలని సర్క్యులర్ అందించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా సంఘం పనిచేస్తుందన్నారు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలో పిల్లలను ఉచితంగా, రాయితీతో చక్కగా చదివించి ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దుకోవాలని కోరారు. ఈ అవకాశాన్ని అక్రిడేషన్ కార్డు కలిగిన జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా ప్రథమ మహాసభ ను సుమారు 200 మంది పైచిలుకు జర్నలిస్టులతో నిర్వహించామని, త్వరలోనే ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో జర్నలిస్టుల శిక్షణ తరగతులను నిర్వహించనున్నట్లు తెలిపారు. అధ్యక్షులు నారాయణరెడ్డి, రాష్ట్ర డిజిటల్ మీడియా కార్యవర్గ సభ్యు లు రఘు గణప, నక్క శ్రీనివాస్, విద్యా శాఖ కన్వీనర్ ఆకుల రాజేష్, హెల్త్ కన్వీనర్ సంజీవ ప్రకాష్, యాదగిరి ప్రవీణ్, నరసింహ, ప్రచార కార్యదర్శి సులిగేమ్ సురేష్ పాల్గొన్నారు.
ప్రభుత్వ జనరల్
ఆస్పత్రి తరలింపు
నారాయణపేట రూరల్: జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్ సమీపంలో ఉన్న ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని మండలంలోని అప్పక్పల్లి దగ్గర నూతనంగా నిర్మించిన మెడికల్ కళాశాలకు తరలిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ డి.రాంకిషన్ ఒక ప్రకటనలో తెలిపారు. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రస్తుత దవాఖానా భవనం దెబ్బతిందని ఇంజినీరింగ్ అధికారులు ధ్రువీకరించడంతో ప్రజలు, రోగుల భద్రతా, సంక్షేమం దృశ్య కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశాల మేరకు ఆదివారం నుంచి ఎమర్జెన్సీ, క్యాజువాలిటీ సేవలను మార్పు చేస్తున్నట్టు తెలిపారు. సోమవారం నుంచి ఔట్ పేషెంట్ విభాగం తరలిస్తామని తెలిపారు. గర్భిణీలు, చిన్నపిల్లల సేవలు జూన్ 3 నుంచి అప్పక్ పల్లి సమీపంలోని ప్రభుత్వ జనరల్ వైద్యశాలలో అందుబాటులోకి వస్తాయని, కొన్ని రోజుల వరకు అత్యవసర ఆపరేషన్ మహబూబ్నగర్ కి రెఫర్ చేయనున్నట్లు తెలిపారు.
పొగాకు వినియోగం మానవాళికి ప్రమాదం
నారాయణపేట రూరల్: దూమపానం చేయడం వల్ల ఊపిరితిత్తులు, క్యాన్సర్ సోకే ప్రమాదం ఉందని, ప్రతి ఒక్కరు పొగాకు వాడకాన్ని త్యజించాలని డీఎంహెచ్ఓ జయచంద్రమోహన్ పిలుపునిచ్చారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని ఆయన ఆర్డీఓ కార్యాలయం దగ్గర జెండా ఊపి ప్రారంభించారు. రోడ్డు పొడవున వైద్య సిబ్బంది పొగాకు నియంత్రణపై నినాదాలు చేస్తూ ప్లకార్డుతో వీరసావర్కర్ సర్కిల్ వరకు చేరుకున్నారు. దూమపానం చేయరాదని బాటసారులు, వాహనదారులతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ.. పొగాకును ఏ రూపంలో తీసుకున్న మనిషి జీవిత కాలాన్ని తగ్గిస్తుందని, వివిధ రకాలైన రోగాలకు కారణం అవుతుందన్నారు.