
‘మల్లమ్మకుంట’పై నీలినీడలు..!
రాజోళిబండ డైవర్షన్ స్కీం (ఆర్డీఎస్).. దశాబ్దాల కాలంగా నీటి వివాదాలకు కేంద్రబిందువుగా నిలిచిన అంతర్రాష్ట్ర ప్రాజెక్ట్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏపీ, కర్ణాటక మధ్య నీటి వాటాల స్థిరీకరణతోపాటు తెలంగాణ ప్రాంతానికి నీటి కేటాయింపుల్లో వివక్షపై జగడాలు కొనసాగాయి. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో ఇదే కీలకాంశంగా మారగా.. తెలంగాణ ఆవిర్భావం తర్వాత సైతం మునుపటి పరిస్థితులే నెలకొన్నాయి. ప్రస్తుతం మూడు రాష్ట్రాల సమస్యగా మారింది. ఇది ఒకవైపు కాగా.. మరోవైపు తుమ్మిళ్ల లిఫ్ట్ ద్వారా వెనుకబడిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల పరిధిలోని ఆర్డీఎస్ ఆయకట్టును పూర్తిస్థాయిలో సస్యశ్యామలం చేయాలనే లక్ష్యం మాటలకే పరిమితమైంది. ఈ ఎత్తిపోతల్లో భాగంగా నిర్మించాల్సిన రిజర్వాయర్లపై ఏళ్ల తరబడి సందిగ్ధత వీడకపోవడం.. ప్రభుత్వాలు మారినప్పుడల్లా కొత్త ప్రతిపాదనలు తెరపైకి రావడం వంటి కారణాలు అనిశ్చితికి కారణమవుతున్నాయి. సరైన ప్రణాళిక లేమి.. రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయ లోపం వెరసి మల్లమ్మకుంట రిజర్వాయర్పై నీలినీడలు కమ్ముకున్న
నేపథ్యంలో ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్.. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్
రిజర్వాయర్కు
గ్రీన్సిగ్నల్.. అంతలోనే..
రిజర్వాయర్లు నిర్మిస్తే తప్ప పూర్తిస్థాయిలో ఆయకట్టుకు నీరందే పరిస్థితి లేదని ఆర్డీఎస్ ఆయకట్టు రైతులు మొరపెట్టుకున్నారు. స్పందించిన కాంగ్రెస్ ప్రభుత్వం మూడు రిజర్వాయర్లలో రూ.520 కోట్ల వ్యయంతో 1.2 టీఎంసీల సామర్థ్యంతో మల్లమ్మకుంట నిర్మాణానికి మాత్రం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. తుమ్మిళ్ల లిఫ్ట్లో కీలకమైన ఈ రిజర్వాయర్ నిర్మాణానికి అధికారులు చేపట్టిన భూసర్వేకు అడుగడుగునా అడ్డంకులు ఎదురయ్యాయి. మొత్తం 567 ఎకరాలు అవసరమని అధికారులు నివేదికలు రూ పొందించారు. పెగ్ మార్కింగ్ పనులు నిర్వహిస్తున్న క్రమంలో రైతులు అడ్డుకున్నారు. పూర్తి నష్టపరిహారం ఇచ్చి.. న్యాయం చేశాకే పనులు మొదలుపెట్టాలని ఆందోళనలకు దిగారు.
● ఈ నేపథ్యంలో నాగర్కర్నూల్ ఎంపీ మల్లురవి కలెక్టర్కు లేఖ రాయడం ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మాణం వల్ల 250 మంది దళిత రైతులు భూములు కోల్పోతారని.. దాన్ని రద్దు చేయాలని ఆయన గద్వాల కలెక్టర్ బీఎం సంతోష్కు లేఖ రాయడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చినట్లయింది. ఈ మేరకు ఆయన నీటిపారుదల శాఖ ఎస్ఈకి లేఖ రాయడం.. ఆ అధికారి పైఅధికారికి నివేదికలు సమర్పించడం.. కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించడం హాట్టాపిక్గా మారింది. మల్లమ్మకుంట రిజర్వాయర్పై నీలినీడలు కమ్ముకోగా.. ఆయకట్టు రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
పేరుకే 87,500 ఎకరాలు..
నిజాం కాలంలో కర్ణాటక పరిధిలోని రాజోళిబండ సమీపంలో తుంగభద్రపై ఆనకట్ట నిర్మించిన విషయం తెలిసిందే. తెలంగాణకు సంబంధించి నడిగడ్డ ప్రాంతంలో 87,500 ఎకరాలకు సాగునీరందించాలనే లక్ష్యంతో ఆనకట్ట ఎడమవైపున 143 కిలోమీటర్ల కాల్వ (ఆర్డీఎస్ కెనాల్) నిర్మాణం పూర్తి చేశారు. అయితే 20 ఏళ్లుగా ఏనాడూ పూర్తిస్థాయిలో ఆయకట్టుకు సాగునీరందలేదు. పంటలు సాగుచేయడం.. నీరందక అవి ఎండిపోవడం.. రైతులు నష్టాల పాలవడం పరిపాటిగా మారింది. కనీసం 30 వేల ఎకరాలకు నీరు అందడం లేదని రైతులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఆర్డీఎస్ ఆయకట్టును పూర్తి స్థాయిలో సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ నేతృత్వంలోని అప్పటి ప్రభుత్వం 2017లో తుమ్మిళ్ల లిఫ్ట్తో పాటు ఇటిక్యాల మండలం వల్లూరు, వడ్డేపల్లి మండలం జూలకల్, తనగల వద్ద మల్లమ్మకుంట వద్ద మూడు రిజర్వాయర్ల నిర్మాణానికి సంబంధించిన ఫేస్–1, 2 పనులకు జీఓ 429 జారీ చేసింది. 9.6 కిలోమీటర్ల మేర పైపులైన్ నిర్మాణం చేపట్టి.. తనగల సమీపంలోని డిస్ట్రిబ్యూటరీ 23 వద్ద డెలివరీ సిస్టమ్ ద్వారా తుంగభద్రలోని నీటిని తోడి ఆర్డీఎస్ కెనాల్కు మళ్లించేందుకు శ్రీకారం చుట్టింది. ఏడాది లోపే తుమ్మిళ్ల లిఫ్ట్ను రూ.190 కోట్లతో ఏర్పాటు చేసి.. కెనాల్కు నీటిని పంపింగ్ చేశారు. కానీ రిజర్వాయర్ల నిర్మాణం అటకెక్కింది.
రిజర్వాయర్ నిర్మాణానికి అడుగడుగునా అడ్డంకులు
కలెక్టర్కు నాగర్కర్నూల్ ఎంపీ మల్లురవి లేఖతో దుమారం
అలంపూర్ పరిధిలోని ఆయకట్టు రైతుల్లో ఆందోళన
చిన్నోనిపల్లి, ఆర్డీఎస్కు లింక్ అంటూ తెరపైకి కొత్త ప్రతిపాదనలు
వ్యతిరేకిస్తున్న అన్నదాతలు.. కాంగ్రెస్లో భిన్నస్వరాలు

‘మల్లమ్మకుంట’పై నీలినీడలు..!