ఆయిల్‌పాం కష్టాలు తీరేనా? | - | Sakshi
Sakshi News home page

ఆయిల్‌పాం కష్టాలు తీరేనా?

Apr 30 2025 12:09 AM | Updated on Apr 30 2025 12:09 AM

ఆయిల్‌పాం కష్టాలు తీరేనా?

ఆయిల్‌పాం కష్టాలు తీరేనా?

ఉమ్మడి జిల్లాలో పంట కోతలు షురూ

గెలల విక్రయానికి అశ్వారావుపేటకు వెళ్లాల్సిందే..

స్థానికంగా ప్రాసెసింగ్‌ పరిశ్రమలు ఉంటేనే రైతులకు ప్రయోజనం

ఉమ్మడి జిల్లాలో

28,999 ఎకరాల్లో సాగు

నర్వ: దేశంలో నూనె గింజల ఉత్పత్తి తగ్గడం.. నూనెల వినియోగం గణనీయంగా పెరగడం వంటి కారణాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్‌పాం సాగును ప్రోత్సహిస్తున్నాయి. డిమాండ్‌ మేర నూనె గింజల ఉత్పత్తే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఆయిల్‌పాం సాగుకు అనువైన నేలలు ఉండటంతో రైతులు ఆసక్తి చూపుతున్నారు. ప్రారంభంలో కాస్త వెనకబడినా.. ప్రభుత్వాలు అందిస్తున్న రాయితీలతో ప్రతి ఏటా సాగు విస్తీర్ణం పెరుగుతోంది. అయితే ఉమ్మడి జిల్లాలో ఆయిల్‌పాం పరిశ్రమ లేకపోవడంతో రైతులు పంటను విక్రయించేందుకు వ్యయ ప్రయాసలకు గురవుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో సాగు ఇలా..

2020–21 సంవత్సరం ప్రారంభంలో ఉమ్మడి జిల్లా పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక కాగా.. 430 ఎకరాల్లో రైతులు ఆయిల్‌పాం సాగుకు శ్రీకారం చుట్టగా.. అధికారులు 4,60,000 మొక్కలను దిగుమతి చేసుకున్నారు. అప్పటి నుంచి క్రమంగా సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 28,999 ఎకరాల్లో ఆయిల్‌పాం సాగవుతోంది. నారాయణపేట జిల్లాలో 5,907 ఎకరాల్లో రైతులు సాగుచేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. జిల్లాలో ఆయిల్‌పాం పరిశ్రమ అందుబాటులో లేకపోవడంతో రైతులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు ఆయిల్‌పాం గెలలను తరలించాల్సి వస్తోంది.

లాభసాటిగా ధరలు..

ఈ ఏడాది ఆయిల్‌పాం ధర పెరిగింది. గతేడాది టన్నుకు రూ. 11వేల నుంచి రూ. 14వేల వరకు ధర ఉండేది. ప్రస్తుతం టన్నుకు రూ. 20వేల నుంచి రూ. 21వేల వరకు ధర పలుకుతోంది. దీంతో ఆయిల్‌పాం రైతులకు లాభసాటిగా మారింది. ఏడాది పాటు కాపు కాస్తుండటంతో రైతులు గెలలను విక్రయించేందుకు అవస్థలు పడాల్సి వస్తోంది. అయితే ప్రతి 30 కి.మీ. ఒక సేకరణ కేంద్రం ఏర్పాటు చేస్తామని.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని అధికారులు చెబుతున్నారు.

చిగురిస్తున్న ఆశలు..

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆయిల్‌ఫెడ్‌ కార్పొరేషన్‌కు చైర్మన్‌ను నియమించింది. అయితే కొత్త పాలకవర్గం ఆయిల్‌పాం సాగుకు కొత్త జనసత్వాలు నింపేందుకు చర్యలు తీసుకోవడంతో రైతుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఇటీవల నారాయణపేట జిల్లాలో చైర్మన్‌ జంగా రాఘవరెడ్డి పర్యటించి.. రూ. 300 కోట్లతో ఆయిల్‌పాం పరిశ్రమను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పరిశ్రమ ఏర్పాటుపై జాప్యం చేయవద్దని రైతులు కోరుతున్నారు.

ఆశించిన స్థాయిలో దిగుబడి..

ఉమ్మడి జిల్లాలో ఆయిల్‌పాం దిగుబడి ఆశించిన స్థాయిలో ఉండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 25వేలకు పైగా ఎకరాల్లో పంట కోతలు చేపట్టినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. నారాయణపేట జిల్లాలో 130 ట న్నులు, వనపర్తిలో 600, జోగుళాంబ గద్వా లలో 300, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 260 ట న్నుల దిగుబడి రాగా.. నాగర్‌కర్నూల్‌ జిల్లా లో ఇప్పడిప్పుడే పంట కోత ప్రారంభమైంది.

పరిశ్రమలు ఉంటేనేప్రయోజనం

పంట కోతలు ప్రారంభమైన నేపథ్యంలో కత్తిరించిన గెలలను గంటల వ్యవధిలోనే పరిశ్రమలో ప్రాసెసింగ్‌ చేస్తే ఎక్కువ స్థాయిలో నూనె వస్తుంది. జిల్లాలో తెంపిన గెలలను అశ్వారావుపేటకు తీసుకెళ్లేందుకు కనీసం ఒక రోజు సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో స్థానికంగానే పరిశ్రమలు అందుబాటులో ఉంటే ప్రయోజనం కలుగుతోందని రైతులు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement