
గన్నీబ్యాగుల కోసం రాస్తారోకో
● రహదారిపై స్తంభించిన ట్రాఫిక్
● కార్యాలయం నుంచి నేరుగా
రహదారిపైకి చేరిన రైతులు
మక్తల్: ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించేందుకు గన్నీబ్యాగులు దొరకక రైతులు ప్రతిరోజు కార్యాలయం చుట్టు తిరిగే పరిస్థితి ఏర్పడింది. సోమవారం దాదాపు 40 వేల బ్యాగులు వచ్చాయని రైతులకు సమాచారం తెలియడంతో టోకన్లు ఇచ్చి రైతులు సింగిల్ విండో కార్యాలయం దగ్గరకు చేరుకున్నారు. గన్నీ బ్యాగులు తమకు సరిపోవడం లేదని, ఏకంగా రైతులు అంబేడ్కర్ చౌరస్తా వరకు చేరుకొని అక్కడ రాస్తారోకో చేశారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ కావడంతో మక్తల్ సీఐ రాంలాల్, మక్తల్ ఎస్ఐ–2 ఆచారి అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడి రాస్తారోకో విరమింప చేశారు. రైతుల సమస్యలు పరిష్కారం చేస్తామని అధికారులు చెప్పడంతో రాస్తారోకో విరమించారు. సంగంబండ, భూత్పూర్ రిజర్వాయర్ కింద ఆయకట్టు సాగు పెరిగి ధాన్యం పండించడంతో గన్నీ బ్యాగులు కరువయ్యాయి. కొనుగోల కేంద్రాలకు వెళ్లాలంటే బ్యాగుల కొరత అధికంగా ఉండంతో ఎండలో ఆరబోసిన వరిధాన్యం వర్షంలో తడిసి ముద్దాయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో అధికారులు పర్యటించి రైతులకు టోకన్ ఇవ్వడం జరుగుతుందని, దాని ప్రకారం గన్నీ బ్యాగులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆదివారం కురిసిన వర్షాలకు వరిధాన్యం తడిసిందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. గంటల తరబడి కార్యాలయం చుట్టు తిరుగున్నా, తమ సమస్యలు ఎవరూ పరిష్కరించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.