కర్నూలు (టౌన్): వైఎస్సార్సీపీ అధికారిక ఫేస్బుక్ పేజీని స్తంభింపజేయడం దుర్మార్గమని ఆ పార్టీ మేధావుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాటిల్ తిరుమలేశ్వర రెడ్డి ఖండించారు. ఆయన మంగళవారం ఎస్వీ కాంప్లెక్స్లో మాట్లాడుతూ.. ప్రజాదరణ పొందిన పార్టీ అధికార పేజీని తొలగించడం ముమ్మాటికీ ప్రజాస్వామ్యంపై దాడి చేయడమే అన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రతినిధిగా ఉన్న రాజకీయ పార్టీకి చెందిన ఫేస్బుక్ పేజీని కనిపించకుండా చేయడం దుస్సాహసమని మండిపడ్డారు. గతంలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 1.4 మిలియన్ ఫాలొవర్స్ ఉన్న ఫేస్బుక్ పేజీని స్తంభింపజేయడం ప్రజల గొంతుకను అణచివేయడమేనని ధ్వజమెత్తారు. నిత్యం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెలుగులోకి తీసుకురావడం, ప్రజల అకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్నందునే వైఎస్సార్సీపీ అధికారిక పేజీకి ఇంత ఆదరణ లభించిందన్నారు. దీన్ని స్తంభింపజేయడం అంటే ప్రజల నుంచి వస్తున్న భావాలను, అభిప్రాయాలను ప్రపంచం దృష్టికి రానీయకుండా చేసే దురుద్దేశమేనని వివరించారు. ఇదంతా నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు.
‘సర్’ ముసుగులో
ఓట్లు తొలగించే కుట్ర
సర్ ముసుగులో రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం బూత్ లెవల్ ఏజెంట్ల ద్వారా ఓటర్ల కులం, ఏ పార్టీ సానుభూతిపరుడు అనే వివరాలపై ఆరా తీస్తోందని ఆరోపించారు. ఆ సమాచారం అంతా సర్ పేరుతో టీడీపీ యాప్ రూపొందించిందన్నారు. ఎప్పటికప్పుడు కేంద్ర కార్యాలయానికి లిస్టు పంపిస్తున్నారని, వైఎస్సార్సీపీ మద్దతుదారులను గుర్తించి వారి ఓట్లను తొలగించేందుకు ఫారం– 7 వాడాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు. టీడీపీ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారన్నారు.


