
ఉపాధ్యాయ ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు?
కర్నూలు సిటీ: ‘డీఎస్సీలో ర్యాంకులు తెచ్చుకున్నాం.. కాల్ లెటర్లు పంపించారు.. మూడు విడతల్లో సర్టిఫికెట్లు పరిశీలన చేశారు.. అయినా ఫైనల్ సెలెక్షన్ లిస్టులో మా పేరు లేదు.. ఉపాధ్యాయ ఉద్యోగం ఎందుకు ఇవ్వరు’ అని విద్యాశాఖ అధికారులను డీఎస్సీ అభ్యర్థులు ప్రశ్నించారు. వందలాది మంది మంగళవారం కర్నూలు డీఈఓ కార్యాలయానికి వచ్చారు. ‘ఒక్కో పోస్టుకు ఒకరినే ఎంపిక చేసి సర్టిఫికెట్లు పరిశీలించామని చెప్పి ఇంత మోసం చేస్తారా’ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అభ్యర్థుల ఆవేదన విన్న తరువాత డీఈఓ ప్రత్యేకంగా ఓ సెల్ ఏర్పాటు చేశారు. ఐదారుగురు హెచ్ఎంలను అక్కడ ఉంచి అభ్యర్థుల నుంచి వినతులు స్వీకరించారు. వచ్చిన వినతులను పరిశీలించిన డీఈఓ శామ్యూల్ పాల్.. ఏఏ అభ్యర్థి ఎందుకు ఉద్యోగానికి ఎంపిక కాలేదో వివరించారు. మరికొంత మందికి హెచ్ఎంలు వివరించారు. డీఈఓ కార్యాలయంలో ఓ ఉద్యోగి నిర్లక్ష్యంతో ఈడబ్ల్యూఎస్ కోటాలో ఉద్యోగాన్ని కోల్పోయానని ఓ నిరుద్యోగి ఆందోళన వ్యక్తం చేశారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ను అందజేసినా ఆన్లైన్లో అప్లోడ్ చేయలేదన్నారు. ఈ విషయంపై బాధితుడు సదరు ఉద్యోగిని అడిగితే తనకు ఎలాంటి సర్టిఫికెట్ ఇవ్వలేదని అంటున్నట్లు తెలుస్తోంది.
మందులకు వెళ్లి మృత్యుఒడిలోకి ...
కోసిగి: ఆరోగ్యం బాగా లేదు మందులు తెచ్చుకుంటానని ఇంటి నుంచి వెళ్లిన ఓ రైతు గుండెపోటుతో హఠాన్మరణం పొందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు..మండల పరిధిలోని సజ్జలగుడ్డం గ్రామానికి చెందిన కురువ వేమన్న (65)కు ఎకర సొంత పొలం, మరో 3 ఎకరాలు కౌలుభూమి ఉంది. ఇందులో రెండెకరాలు ఉల్లిపంట సాగు చేశాడు. ఉల్లి ధరలు పడిపోవడంతో పెట్టుబడి కూడా రాలేదు.మిగతా రెండెకరాల్లో వేసిన పత్తి పంట ఇటీవల కురిసిన వానలకు దెబ్బతినంది. ఈక్రమంలో పంటసాగుకు చేసిన అప్పులు ఎలా తీర్చాలనే బెంగతో అనారోగ్యానికి గురయ్యాడు. మంగళవారం మందులు తెచ్చుకుంటానని ఇంట్లో చెప్పి కోసిగికి వెళ్లిన అతను బస్టాండ్ సమీపంలో కుప్పకూలిపోయాడు. స్థానికులు గమనించి లేపే ప్రయత్నం చేసేలోపు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మృతుడికి భార్య లసుమమ్మ, ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
కర్నూలు(అగ్రికల్చర్): పశుసంవర్ధక శాఖలో ఇద్దరు డిప్యూటీ డైరెక్టర్లకు జాయింట్ డైరెక్టర్లుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో ఆర్టీ నెంబర్ 327 జారీ చేసింది. కర్నూలు డివిజన్ డిప్యూటీ డైరెక్టర్గా పని చేస్తున్న వి.దుర్గాప్రసన్నబాబును జేడీగా పదోన్నతిపై డైరెక్టరేట్కు బదిలీ చేశారు. ఆదోని డివిజన్ డీడీగా పనిచేస్తున్న పి.వెంకటరమణ శ్రీకాకుళం జిల్లా జాయింట్ డైరెక్టర్గా బదిలీ అయ్యారు. ఏడీలకు డీడీలుగా పదోన్నతి కల్పించడం ద్వారా ఈ స్థానాలు భర్తీ కానున్నాయి.

ఉపాధ్యాయ ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు?