
శ్రీచక్ర హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత
అనిత మృతితో సంబంధం లేదు
అనిత మృతికి ఆసుపత్రికి ఎలాంటి సంబంధం లేదని శ్రీ చక్ర హాస్పిటల్ అధినేత డాక్టర్ విజయకుమార్రెడ్డి చెప్పారు. గురువారం మధ్యాహ్నం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అనిత అనే యువతి మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జ్వరంతో చికిత్స నిమిత్తం వచ్చిందని, క్యాజువాలిటీలోనే సాయంత్రం వరకు ఆమెకు అవసరమైన మందులు ఇచ్చి, ఫ్లూయిడ్స్ పెట్టామన్నారు. ఆమె కోలుకోవడంతో ఇంటికి వెళ్తానంటే పంపించామన్నారు. మరుసటి రోజు రాత్రి అత్యవసర పరిస్థితిలో కుటుంబసభ్యులు ఆమెను క్యాజువాలిటీకి తీసుకొచ్చారని, అప్పటికే ఆమె మృతి చెంది ఉందన్నారు. ఆమె మృతికి, ఆసుపత్రికి ఎలాంటి సంబంధం లేదని, ఆసుపత్రిపై దాడులు చేయడం దారుణమన్నారు. దాడికి పాల్పడిన వారిపై తాము పోలీసులకు ఫిర్యాదు చేశామని, దాడిపై న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. సమావేశంలో ఐఎంఏ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ రామచంద్రనాయుడు, డాక్టర్ ఎస్వీ రామమోహన్రెడ్డి, డాక్టర్ బాలమద్దయ్య, ప్రైవేటు ఆసుపత్రుల సంఘం అధ్యక్షులు డాక్టర్ వేణుగోపాల్ పాల్గొన్నారు.
కర్నూలు/కర్నూలు(హాస్పిటల్): జ్వరం కారణంగా చికిత్సకు వచ్చి యువతి మృతి చెందడంతో ఆమె కుటుంబసభ్యులు గురువారం కర్నూలులోని శ్రీ చక్ర హాస్పిటల్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఆసుపత్రిపై దాడులు చేసి గాజుతో తయారు చేసిన కిటికీలు, తలుపులు ద్వంసం చేశారు. వంద మందికి పైగా నిర్వహించిన ఈ దాడితో ఆ ప్రాంతంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అనంతపురం జిల్లా పామిడికి చెందిన అనిత(21)కు స్థానిక కల్లూరు ఎస్టేట్లోని పోలీస్ కాలనీకి చెందిన ప్లాట్ల రమణ కుమారుడు నాగేంద్రతో ఏడాది క్రితం వివాహం జరిగింది. నాగేంద్ర తండ్రితో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నా రు. ఈ క్రమంలో అనితకు ఈ నెల 15వ తేదీ జ్వరం రావడంతో సమీపంలో ఉన్న శ్రీచక్ర హాస్పిటల్కు తీసుకెళ్లారు. అక్కడి క్యాజువాలిటీలో ఆమెకు అవసరమైన చికిత్సను అందించి సాయంత్రం ఇంటికి పంపించారు. మరుసటి రోజైన బుధవారం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అదే రోజు రాత్రి ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి ఆమె మరణించినట్లు ధ్రువీకరించారు. కాగా గురువారం ఉదయం అనిత కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున శ్రీచక్ర హాస్పిటల్ వద్దకు వచ్చారు. అనితకు సకాలంలో వైద్యం అందించలేదని, మెరుగైన వైద్యం అందించి ఉంటే బ్రతికేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళన ప్రారంభించారు. ఈ ఆందోళన క్రమంగా ఉద్రిక్తతకు దారి తీసింది. ఒక దశలో ఆసుపత్రిపై రాళ్లు విసిరి అద్దాలు పగులగొట్టారు. ఆ తర్వాత బయట మెడికల్షాపుకు ఉన్న పెద్ద అద్దాన్ని, గాజు తలుపును ధ్వంసం చేశారు. ఆసుపత్రిలోకి వెళ్లి కనిపించిన ప్రతి వస్తువును ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో క్యాజువాలిటీ, ఆరోగ్యశ్రీ కియోస్క్, కిటికీలు దెబ్బతిన్నాయి. విషయం తెలుసుకున్న డీఎస్పీ బాబుప్రసాద్, సీఐలు రామయ్య యాదవ్, నాగరాజురావు, శేషయ్య, విక్రమసింహ, తబ్రేజ్లు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
విచారణ జరిపి న్యాయం చేయండి
శ్రీచక్ర హాస్పిటల్లో డ్యూటీ డాక్టర్ ఇచ్చిన మందులు వికటించడం వల్లే తన భార్య అనిత (20) మృతిచెందిందని భర్త వడ్ల నాగేంద్రప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నెల 12వ తేదీన తన భార్యకు జ్వరంగా ఉండటంతో రెండు రోజుల పాటు మాత్రలు మింగినా నయం కాలేదు. ఈనెల 15న శ్రీచక్ర ఆసుపత్రిలో చేర్పించగా వైద్యులు పరిశీలన జరిపి రెండు రోజుల పాటు వైద్యచికిత్సలు చేసి డిశ్చార్జి చేశారన్నారు. మరుసటి రోజు వైద్యం వికటించి తన భార్య మృతిచెందిందని నాగేంద్ర ప్రసాద్.. నాలుగో పట్టణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సంఘటనపై విచారణ జరిపి న్యాయం చేయాలని ఆయన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
యువతి మృతిపై కుటుంబ సభ్యుల
ఆందోళన
ఆసుపత్రిపై దాడులు, అద్దాలు ధ్వంసం

శ్రీచక్ర హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత

శ్రీచక్ర హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత

శ్రీచక్ర హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత