
ప్రజల అర్జీలపై దృష్టి సారించాలి
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: ప్రజల వినతుల పరిష్కారంలో అర్జీదారులు సంతృప్తి చెందేలా అధికారులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి ఆదేశించా రు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డీఆర్ఓ రామునాయక్ స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ.. జిల్లాలో రెవెన్యూ, రీసర్వే అంశాలపై ఎక్కువ శాతం ఫిర్యాదులు వస్తున్నాయని, అందుకు ఆర్డీఓలు, తహసీల్దార్లు ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలన్నారు. ముఖ్యంగా ఆర్డీఓలు ప్రతి రోజూ తహసీల్దార్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి అర్జీలు బియాండ్ ఎస్ఎల్ఎ వెళ్లకుండా పరిష్కరించేలా చూడాలన్నారు. రీఓపెన్, గడువులోపల అర్జీలపై నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సమీక్ష చేయడం జరుగుతుంది కాబట్టి వాటి పరిష్కారంలో జాప్యం లేకుండా చూడాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అదే విధంగా ప్రజా పరిష్కార వేదికకు వచ్చే విభిన్న ప్రతిభావంతుల కోసం 3 సహాయకులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో 221 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి కలెక్టర్కు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ప్రాణదాన ట్రస్ట్కు రూ.5 లక్షల విరాళం
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న ప్రాణదాన ట్రస్ట్కు సోమవారం హైదరాబాద్కు చెందిన లక్ష్మీప్రసన్న కాంట్రాక్టింగ్ ఎల్ఎల్పీ వారు రూ.5 లక్షల విరాళాన్ని పర్యవేక్షకురాలు టీ.హిమబిందుకు అందజేశారు. విరాళాన్ని అందించిన దాతకు దేవస్థానం తరుఫున స్వామివారి శేషవస్త్రాలను, లడ్డూప్రసాదాలను, జ్ఞాపికను అందజేసి సత్కరించారు.
10న శ్రీశైల భ్రామరికి శాకంబరీ ఉత్సవం
శ్రీశైలంటెంపుల్: అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల మహాక్షేత్రంలో లోకకల్యాణం కోసం అషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని ఈ నెల 10న భ్రమరాంబాదేవి అమ్మవారికి శాకంబరీ ఉత్సవం నిర్వహించనున్నారు. ఈ ఉత్సవంలో అమ్మవారి మూలమూర్తిని వివిధ రకాల కూరగాయలతో, అకుకూరలతో, పలు రకాల ఫలాలతోవిశేషంగా అలంకరిస్తారు. దేవాలయ ప్రాంగణాన్ని పలు రకాల ఆకుకూరలు, కూరగాయలతో అలంకరిస్తారు. ఉత్సవంలో భాగంగానే అమ్మవారి ఉత్సవమూర్తికి, ఆలయ ప్రాంగణంలోని రాజరాజేశ్వరిదేవికి, గ్రామదేవత అంకాలమ్మ వారికి ప్రత్యేక పూజలు, విశేషంగా శాకాలంకరణ చేస్తారు. అమ్మవారికి శాకాలతో అర్చించడం వలన అతివృష్టి, అనావృష్టి నివారించబడి, సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగా పండుతాయని, కరువు కాటకాలు నివారించబడతాయని పురాణాలు చెబుతున్నాయి.

ప్రజల అర్జీలపై దృష్టి సారించాలి