
ఇల్లు ఎట్లా గడిచేది?
కోవెలకుంట్ల: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కూలీలను వేతనాల సమస్య వెంటాడుతోంది. చేసిన పనులకు వారాల తరబడి వేతనాలు అందకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారటంతో అష్టకష్టాలు పడుతున్నారు. జిల్లాలోని 29 మండలాల పరిధిలో 4.38 లక్షల జాబ్కార్డు కలిగిన కుటుంబాలు ఉన్నాయి. ఇందులో 8.70 లక్షల మంది కూలీలు ఉన్నారు. 1.50 లక్షల కుటుంబాల్లోని 2.55 లక్షల మంది కూలీలు ఉపాధి పనులకు వెళుతున్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆయా మండలాల్లో 78,23,780 పనిదినాలు లక్ష్యంగా నిర్ధేశించారు. ఇందుకోసం రూ. 335 కోట్ల లేబర్ (కూలీల వేతనం, మెటీరియల్ కలిపి)బడ్జెట్ కేటాయించారు. గతంలో ప్రతి రెండు వారాలకొక సారి వేతనాలు అందేవి. ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనలో నెలల తరబడి వేతనాలు అందక, ప్రభుత్వం నిర్ణయించిన సగటు వేతనం రాక కూలీలు ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఉపాధి పనులకు వెళుతున్న కూలీలకు 10–12 వారాల నుంచి వేతనాలు అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఇద్దరు సభ్యులున్న ఒక్కో కుటుంబానికి దాదాపు రూ. 30 వేల చొప్పున వేతనాలు పెండింగ్లో ఉండటంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని ఆయా మండలాల పరిధిలో రూ. 112 కోట్ల వేతనాలు విడుదల కావాల్సి ఉంది.
వ్యవసాయ పనుల్లేక..
ఉపాధి వేతనం అందక
ఈ ఏడాది జూన్ నెల నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా పూర్తిస్థాయి వ్యవసాయ పనులు ప్రారంభం కాకపోవడంతో వ్యవసాయ పనులు లేక మరో వైపు ఉపాధి పనులకు వెళుతున్నా వేతనాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయలు, నిత్యావసరాలు, తదితర సరుకులను అప్పులు చేసి తెచ్చుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. రెండు నెలలకు పైబడి వేతనాలు ఇవ్వకపోవడంతో వ్యాపారులు అప్పులు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదని కూలీలు పేర్కొంటున్నారు. జిల్లాలోని కొన్ని గ్రామాల్లో ఉపాధి కూలీలకు మే 10వ తేదీ వరకు చేసిన పనులకు వేతనాలు చెల్లించగా ఎక్కువ శాతం గ్రామాల్లో బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. వేతనాలు సక్రమంగా అందకపోవడంతో జిల్లాలో ఈ నెల నుంచి 50 వేల మంది కూలీలు మాత్రమే ఉపాధి పనులకు వెళుతున్నారు.
ఉపాధి కూలీలకు అందని వేతనాలు
జిల్లాలో రూ. 112 కోట్లు పెండింగ్
వేతనాలందక భారంగా
కుటుంబ పోషణ