కుంటకు ట్రాక్టర్ సాయంతో ఇంజిన్లు అమర్చిన దృశ్యం
కోవెలకుంట్ల: ఖరీఫ్ సీజన్ ప్రారంభమై ఇరవై రోజులు దాటినా వరణుడు పూర్తిస్థాయిలో కరుణించకపోవడంతో రైతులకు సాగునీటి కష్టాలు తప్పడం లేదు. వర్షాధారంగా మొక్కజొన్న పంటను సాగు చేసిన రైతులు అదునుకు వర్షం పడకపోవడంతో సాగునీటిని మళ్లించుకునేందుకు అవస్థలు పడుతున్నారు. కోవెలకుంట్లకు చెందిన రాముడు మండలంలోని గుంజలపాడు సమీపంలో ఎకరా రూ. 15 వేలు కౌలు చెల్లించి నాలుగు ఎకరాల పొలంలో మొక్కజొన్న సాగు చేశాడు. పైరు నెల రోజుల దశలో ఉండగా సాగునీటి వనరులు అందుబాటులో లేకపోవడంతో సాగునీటి మళ్లింపుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నాడు. పైరుకు రెండు కి.మీ దూరంలో ఎస్సార్బీసీ 10వ బ్లాక్ కాల్వ పక్కన ఉన్న కుంటలో నీరు సంవృద్ధిగా ఉంది. ఆ కుంటకు ట్రాక్టర్ ఇంజిన్ సాయంతో రెండు మోటార్లు అమర్చి నీటిని పక్కనే ఉన్న ఎస్సార్బీసీలోకి వదిలి అక్కడి నుంచి పొలానికి సమీపంలో కాల్వకు మరో డీజిల్ ఇంజిన్ ఏర్పాటు చేసి పైపుల ద్వారా పొలానికి సాగునీరు మళ్లించుకుంటున్నాడు. ట్రాక్టర్, డీజిల్ ఇంజిన్లు, పైపులు సొంతంగా ఉన్నప్పటికి డీజిల్, కూలీల రూపంలో ఒక్కో తడికి రూ. 10 వేలు వెచ్చించాల్సి వస్తోందని రైతు పేర్కొన్నాడు. ట్రాక్టర్, ఇంజిన్లు సొంతంగా లేకపోతే అదనంగా మరో రూ. 10 వేలు భారం పడేదన్నారు. ఎస్సార్బీసీకి సాగునీటిని విడుదల చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
వానలు లేక వాడు పడుతున్న పంట
కుంటనీటిని మెటార్లసాయంతో
పైరుకు మళ్లింపు