
పెద్దాసుపత్రిలో ముగ్గురికి అరుదైన ఆపరేషన్లు
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని యురాలజి విభాగంలో ముగ్గురు రోగులకు అరుదైన శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించారు. వివరాలను సోమవారం యురాలజి విభాగంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లుతో కలిసి ఆ విభాగం ఇన్ఛార్జి హెచ్వోడి డాక్టర్ పి.ముత్యశ్రీ వివరించారు.
● కోడుమూరుకు చెందిన బావన్న(75)కు మూత్ర సంచి, కుడి కిడ్నీకి క్యాన్సర్ ఉంది. ల్యాప్రోస్కోపిక్ విధానంలో ఆయనకు ఈ నెల 12న కిడ్నీ, మూత్రసంచిని తొలగించారు.
● ఎమ్మిగనూరుకు చెందిన శ్రీనివాసులు(55)కు కుడి కిడ్నీలో క్యాన్సర్ ఉంది. ఈ క్యాన్సర్ శరీరంలోని పెద్ద రక్తనాళాలైన అయోట్రా, ఐవీసీకి చుట్టుపక్కల ఉన్న లింప్ గ్రంధులకు పాకి, వాటికి అతుక్కుని ఉన్నాయి. ఈయనకు ల్యాప్రోస్కోపిక్ విధానంలో 13వ తేదిన కిడ్నీతో పాటు లింప్ గ్రంధిని తీసివేశారు.
● ఆత్మకూరుకు చెందిన అఫ్జల్బీ(59)కి అడ్రినల్ గ్రంధిలో 12 సెం.మీల క్యాన్సర్ కణితి ఉంది. ఆమె అధిక బరువు ఉండటం వల్ల పెద్దకోత లేకుండా ల్యాప్రోస్కోపిక్ విధానంలో ఈ నెల 16న ఆపరేషన్ చేసి తొలగించారు. ఈ ఆపరేషన్లు డాక్టర్ ముత్యశ్రీతో పాటు యూరో ఆంకాలజిస్టు డాక్టర్ సేపూరి బాలరవితేజ, యురాలజిస్టులు రాజశేఖర్, మహేష్, అరుణ, అనెస్టెటిస్ట్ డాక్టర్ మురళీప్రభాకర్ నిర్వహించారు.